నకిలీ పట్టాలతో మోసపోయిన వారు ఫిర్యాదు చేయొచ్చు : డీఎస్పీ వెంకటేశ్వర్లు

నకిలీ పట్టాలతో మోసపోయిన  వారు ఫిర్యాదు చేయొచ్చు : డీఎస్పీ వెంకటేశ్వర్లు
  • డీఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్ నగర్ రూరర్, వెలుగు:  మహబూబ్‌‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి ఆదర్శ కాలనీలోని 523 సర్వే నంబర్లలో పట్టాల ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే రూరల్ పోలీస్ స్టేషన్‌‌లో నేరుగా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ  వెంకటేశ్వర్లు సూచించారు.  శనివారం రూరల్ పోలీస్ స్టేషన్‌‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  523 సర్వే నంబర్లలో  ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి అమ్ముకున్న కేసులో ముగ్గురు నిందితులను రాయుడు , దేవా,  రాజును  గతంలో అరెస్టు చేసి విచారించామన్నారు. 

వీరు శ్రీకాంత్ గౌడ్ తో కలిసి నేరం చేసినట్లు ఒప్పుకున్నారన్నారు.  రెవెన్యూ రబ్బర్ స్టాంపులు, నకిలీ ప్లాట్ల పట్టాలు, బీఎండబ్ల్యూ కారు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌‌కు పంపినట్లు తెలిపారు. ఈ కేసులో  ఏ 4 గా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  తమ్ముడు  శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్టు పేర్కొన్నారు.

 శ్రీకాంత్ గౌడ్ కు  కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందని అతడు శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌‌లో  లొంగిపోయారన్నారు. శ్రీకాంత్ రెడ్డి నేరం ఒప్పుకోగా కోర్టు  అతడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చిందన్నారు.  సమావేశంలో సీఐ గాంధీ నాయక్, ఎస్సై విజయ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.