
తొగుట, (దౌల్తాబాద్) వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తే సీఎంగా వుంటాడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్యంపేట్, సురంపల్లి, లింగరాజ్ పల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విచ్చలవిడిగా లిక్కర్ అమ్ముతూ ప్రజలను తాగుబోతులను చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ సమయంలో కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వనని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ను కుటుంబ పార్టీగా చేసుకున్నారని మండిపడ్డారు. తన కుటుంబంలోని అందరికీ రాజకీయ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ బిడ్డలను మర్చిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు కిషన్, చిక్కుడు చంద్రం, శ్రీకాంత్, భూపాల్ రెడ్డి, ప్రసాద్ రావు, కేతకనకరజు, రామస్వామి గౌడ్ రాజాగౌడ్ పలువురు పాల్గొన్నారు.