నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం

నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం
  • గోదావరి తీరాన నీట మునిగిన పంటలు
  • జిల్లాలో మళ్లీ దంచికొట్టిన వాన 6.2 సె.మీ నమోదు

నిజామాబాద్​, వెలుగు: కాస్త తెరిపిచ్చినట్లు కనబడిన వాన జిల్లాలో మరోసారి దంచికొట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం పొద్దున 5 గంటల దాకా 6.2 సె.మీ వర్షం నమోదైంది. డొంకేశ్వర్​లో అత్యధికంగా 16.2 సె.మీ వర్షం కురువగా ఇందూర్​ పక్కనున్న ముగ్పాల్​ మండలంలో 14.01 సె.మీ కురిసింది. ఆలూరులో 12.0,   ఇందల్వాయిలో 11.3, ఆర్మూర్​లో 10.5, డిచ్​పల్లి, వేల్పూర్​లో 10.0, రెంజల్​ మండలంలో 9.0,  మాక్లూర్​ 8.9,  నిజామాబాద్​ నార్త్​లో 7.04, సౌత్​లో 6.8, నిజామాబాద్​ మండలంలో 6.2 సె.మీ వర్షం నమోదైంది.  వర్షం ధాటికి రోడ్లపై భారీ వరద పారింది. 

కాలూర్​ రోడ్​ క్లోజ్​


మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా నగరంతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ లోతట్టు కాలనీ ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. నగర శివారులోని కాలూర్​-ఖానాపూర్​ మెయిన్​ రోడ్​ మీదుగా రెండు ఫీట్ల మేరకు వరద పారడంతో రోడ్​ క్లోజ్​ చేశారు. దుబ్బా-బైసాస్​ మీదుగా వాహనాలు నడువలేదు.  మాణిక్​బండార్​ ​ చౌరస్తాలో చెరువును తలపించేలా వర్షం నీరు చేరడంతో మున్సిపల్​ కార్పొరేషన్​ సిబ్బంది డ్రైన్​ పూడికను జేసీబీతో తొలగించి యుద్ధప్రతిపాదికన వాటర్​ క్లియర్​ అయ్యేలా చేశారు.  


నీట మునిగిన పంటలు

ఎస్సారెస్సీకి ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ ఎఫెక్ట్​ మొదలైంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పాటు మంజీరాలో వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకు 3.05 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. 3.58 లక్షల క్యూసెక్కుల నీటిని ఇంజినీర్లు బయటకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టుకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని బోధన్​ మండలం హంగర్గా, బిక్నెల్లి గ్రామాల వరకు బ్యాక్​ వాటర్​ ప్రభావం పడి పంటలు నీట మునిగాయి. జిల్లాలో 25 వేల ఎకరాలలో సోయాబిన్​ పంట సాగవుతుండగా బోధన్​ మండలంలోనే 20 వేల ఎకరాలు ఉంది. మరో మూడు వారాలలో కోతకు వచ్చే పంట నీట మునిగి కుళ్లిపోతోంది.