
భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయ్యింది. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు హైదరాబాద్ లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరింది. దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి కింద నుంచి వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. బ్రిడ్జి కిందనుంచి ఎవరూ వెళ్లకుండా.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో.. ఇరువైపుల నుంచి ఎవరినీ రానివ్వకుండం లేదు. ఇక చేసేది ఏమీలేక నల్లగండ్ల ఫ్లై ఓవర్ నుంచి వాహనాలను మళ్లిస్తున్నారు. డ్రైనీజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే రైల్వే బ్రిడ్జి కిందకు వరద నీరు చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. బ్రిడ్జి కిందకు వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.