
కోల్కతా: దులీప్ ట్రోఫీని సంప్రదాయబద్దమైన ఇంటర్ జోనల్ ఫార్మాట్లో నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శనివారం నిర్ణయించింది. గతంలో నిర్వహించిన చాలెంజర్ ట్రోఫీ ఫార్మాట్ (ఎ,బి,సి,డి)లో కాకుండా ఆరు రీజియన్లుగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ పద్ధతిలో పోటీలను ఏర్పాటు చేయనున్నారు. 1961–62 నుంచి 2014–15 వరకు దులీప్ ట్రోఫీని ఇంటర్ జోనల్ ఫార్మాట్లోనే నిర్వహించారు. కానీ 2015లో రాహుల్ ద్రవిడ్ ఎన్సీఏ పగ్గాలు చేపట్టిన తర్వాత దులీప్ ట్రోఫీ ప్లేస్లో చాలెంజర్ ఫార్మాట్ను తీసుకొచ్చాడు. ఇందులో బ్లూ, రెడ్, గ్రీన్ జట్లు బరిలోకి దిగేవి.
ఇందులో రాణించిన ప్లేయర్లను సెలెక్టర్లు టీమిండియాకు ఎంపిక చేశారు. 2019 సీజన్ వరకు ఇదే కొనసాగింది. కొవిడ్ వల్ల 2020, 2021లో దులీప్ ట్రోఫీ జరగలేదు. 2022, 2023లో మళ్లీ జోనల్ మీట్గా నిర్వహించారు. 2024 మళ్లీ ఫార్మాట్ను మార్చారు. ఇలా ప్రతిసారి మార్చకుండా ఒకేసారి ఎక్కువ మంది ప్లేయర్ల ఆటగాళ్ల పెర్ఫామెన్స్ను పర్యవేక్షించడానికి వీలుగా ఇంటర్ జోనల్ పద్ధతిలోనే దులీప్ ట్రోఫీని నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ప్రతి జోన్కు సొంతంగా సెలెక్షన్ కమిటీ ఉంటుంది. ఇందులో నేషనల్ సెలెక్టర్లను శాశ్వత ఆహ్వానితులుగా చేర్చాలని అనుకుంటున్నారు. బీసీసీఐ గుర్తింపు పొందిన స్కోరర్లకు రోజుకు రూ. 15 వేల వేతనం చెల్లించాలని కూడా అన్ని రాష్ట్ర సంఘాలను బీసీసీఐ ఆదేశించింది.