
ప్రభుత్వ భూమిలో కట్టుకున్న ఇండ్లు కూల్చొద్దంటే డబ్బులివ్వాలని డిమాండ్
కబ్జాదారులతో వీఆర్ఏ ఫోన్ సంభాషణ వైరల్
కుత్బుల్లాపూర్,వెలుగు: కబ్జాదారులను డబ్బు డిమాండ్ చేస్తూ దుండిగల్ వీఆర్ఏ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. దుండిగల్ మండల పరిధి తండా–2లోని ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీరి ఇండ్లు కూల్చకూడదంటే.. డబ్బులు ఇవ్వాలని వీఆర్ఏ యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు మొబైల్ ఫోన్లో మాట్లాడిన మాటల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీ ఇండ్లు కూల్చకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే నిర్మాణాలు కూల్చివేస్తామని, ఉన్నతాధికారులకు కూడా వాటాగా డబ్బు ఇవ్వాలని కబ్జాదారులతో మాట్లాడాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కబ్జాదారులతో ఫోన్లో మాట్లాడింది వీఆర్ఏ యాదగిరేనని నిర్ధారించుకున్న దుండిగల్ తహసీల్దార్ వి.భూపాల్ బుధవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మండల అధికారులు స్పందించి తండా -2లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.