మద్యం మత్తులో తల్వార్తో కాంగ్రెస్ నేత కొడుకు హల్ చల్

మద్యం మత్తులో తల్వార్తో కాంగ్రెస్ నేత కొడుకు హల్ చల్
  • బొడ్రాయి వద్దకు వెళ్లిన ఇద్దరు ఎస్సీ యువకులపై బీర్ సీసాతో దాడి 
  • మంగళవారం రాత్రి వరంగల్ సిటీ సాకరాశికుంటలో ఘటన

ఖిలా వరంగల్ (కరీమాబాద్), వెలుగు : బొడ్రాయి పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అదికాస్త తల్వార్ తిప్పడం. బీరు సీసాతో దాడిచేసి గాయపరిచే వరకు వెళ్లిన ఘటన వరంగల్ సిటీ కరీమాబాద్ పరిధిలో జరిగింది. మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన ప్రకారం. సాకరాశికుంటలో మంగళవారం బొడ్రాయి పండుగ జరిగింది. 

స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు పులిశేరు ప్రణిత్ అలియాస్ పవన్ మద్యం తాగుతుండగా.. అదే సమయంలో బొడ్రాయి వద్దకు స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు వెళ్లారు. వారిని అక్కడినుంచి వెళ్లిపోవాలని పవన్ హెచ్చరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది. 

దీంతో బీరు తాగుతున్న పవన్ రోడ్డు మీద  కాసేపు తల్వార్ తో  హల్ చల్ చేశాడు. అంతటితో ఆగకుండా బీర్ సీసాతో అరుణ్ అనే వ్యక్తిని పొడిచి గాయపరిచాడు. గణేశ్ అనే వ్యక్తిని కొట్టడడంతో పళ్లు విరిగాయి. అదేరోజు అర్ధరాత్రి బాధితులను ఎంజీఎంకు తరలించారు. 

బుధవారం ఉదయం ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు 50 మంది బొడ్రాయి వద్దకు వెళ్లగా పోలీసులు చెదరగొట్టారు.  ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.