ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 5.9 తీవ్రత నమోదు

ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 5.9 తీవ్రత నమోదు

జకార్తా: ఆగ్నేయాసియా దేశాలను వరుస భూకంపాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్‎లాండ్ దేశాలు భారీ భూకంపాల ధాటికి గడగడలాడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. తాజాగా ఇండోనేషియాలో మరో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 8) తెల్లవారుజామున పశ్చిమ ఆషే ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‎పై 5.9 తీవ్రవతో భూప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశ వాతావరణ శాఖ, జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) వెల్లడించింది.

స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 2:48 గంటలకు భూమి కంపించిందని.. సిమెయులు రీజెన్సీలోని సినాబాంగ్ నగరానికి ఆగ్నేయంగా 62 కి.మీ దూరం, సముద్ర మట్టానికి 30 కి.మీ లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. అర్థరాత్రి గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాసేపటిదాకా ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం మొదట 6.2 తీవ్రతతో నమోదు కాగా.. తర్వాత తీవ్రత తగ్గిందని అధికారులు తెలిపారు. 

ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. ఇప్పటివరకు తీవ్రమైన ఆస్తి  నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టింది. కాగా, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‎లో ఉన్న ఇండోనేషియా దేశంలో తరుచు భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ క్రమంలోనే గత నెల (మార్చి) లో కూడా ఈ దేశంలో భూకంపం సంభవించింది. మాసోహి, కబుపటెన్ మలుకు టెంగా సమీపంలో 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.