
- ప్రభుత్వానికి ఈబీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి వినతి
హైదరాబాద్, వెలుగు: అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఈబీసీ వెల్ఫేర్ బోర్డుతో పాటు మంత్రిత్వ శాఖ, కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. ఈబీసీల సంక్షేమానికి రూ. 10 వేల కోట్లు కేటాయించాలని, సబ్ ప్లాన్ తీసుకురావాలని విన్నవించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఓసీ, ఈబీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఓసీకి చెందిన 12 కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓసీల్లో బ్రాహ్మణులు, రెడ్లు, ఆర్యవైశ్యులు, క్షత్రియులు, కమ్మ, వెలమ, ముస్లిం, బలిజ, వంటరి కాపు, తెలగ సామాజిక వర్గంలో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. అన్ని కులాలకు అమలు చేస్తున్న ప్రభుత్వ స్కీమ్ లను ఈబీసీలకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఈబీసీల కోసం గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని, స్వయం ఉపాధి స్కీమ్ లు, పావలా వడ్డీ రుణాలు, ఓవర్సీస్ స్కాలర్ షిప్ అవకాశం కల్పించాలన్నారు.