సురానా ఇండస్ట్రీస్ ఎండీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు

సురానా ఇండస్ట్రీస్ ఎండీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఈడీ సోదాలు ముగిశాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో ఈడీ సోదాలు ముగిసినట్లు అధికారులు తెలిపారు. భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. నరేంద్ర సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధుల బదలాయింపు చేసినట్లు ఈడీ అధికారులు తేల్చారు. పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు.

సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ.. సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇంట్లో కూడా ఈడీ అధికారులు భారీగా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో కోట్లలో నగదుతో పాటు పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టి నాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేసింది.

అసలేం జరిగిందంటే..
సురానా గ్రూప్‌‌ ఆఫ్‌ కంపెనీల్లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌  డైరెక్టరేట్‌‌ (ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సురానా అనుబంధ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్‌‌, భాగ్యనగర్ ప్రాపర్టీస్‌‌పైనా ఏకకాలంలో తనిఖీలు చేసింది. మాదాపూర్‌‌‌‌, జూబ్లీహిల్స్, బోయిన్‌‌పల్లిలోని సురానా గ్రూప్  కంపెనీ చైర్మన్  నరేందర్ సురానా, ఎండీ దేవేందర్  సురానా ఇళ్లతో పాటు సాయిసూర్య డెవలపర్స్‌‌  కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. సాయిసూర్య  డెవలపర్స్‌‌, భాగ్యనగర్  ప్రాపర్టీస్‌‌పై గతేడాది సైబరాబాద్​లో ఎకనామిక్‌‌  అఫెన్సెస్‌‌  వింగ్‌‌ తో పాటు చెన్నై,  బెంగళూరు‌‌లో సురానా గ్రూప్‌‌ ఆఫ్  కంపెనీలపై నమోదైన సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్‌‌  కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.

 కంపెనీల చైర్మన్‌‌, ఎండీలు సహా కార్పొరేట్‌‌  ఆఫీసుల్లో పలు హార్డ్‌‌డిస్కులు, ల్యాప్‌‌టాప్‌‌లను స్వాధీనం చేసుకుంది. రియల్  ఎస్టేట్‌‌ ప్రాజెక్టుల పేరుతో వసూలు చేసిన  డబ్బును ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. వట్టినాగులపల్లిలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సాయిసూర్య డెవలపర్స్‌‌, భాగ్యనగర్  ప్రాపర్టీస్‌‌  ప్రచారం చేశాయి. సాయితులసీ ఎన్‌‌క్లేవ్‌‌, షణ్ముక నివాస్‌‌  పేరుతో ప్లాట్ల విక్రయాలను ప్రారంభించాయి. ఒక్కో ప్లాట్‌‌కు రూ.3.25 కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నాయి. అడ్వాన్స్‌‌గా రూ.1.45 కోట్లు  వసూలు చేశాయి. అయితే, ప్లాట్లను రిజిస్ట్రేషన్  చేయకపోవడంతో బాధితులు నిరుడు నవంబరు‌‌లో సైబరాబాద్  ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.