
- వ్యాపారి మునావర్ ఖాన్, ఖదీరున్నిసా,
- ఎంఏ సుకూర్ ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు
- వింటేజ్, బీఎండబ్ల్యూ కార్లు, 25 లక్షల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం!
- భూదాన్ యజ్ఞ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరంతా నిందితులు
- గతంలో నాగారంలో 42 ఎకరాల 33 గుంటలు అన్యాక్రాంతం
- ఐఏఎస్ అమోయ్కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బదలాయింపు
హైదరాబాద్, వెలుగు: భూదాన్ భూముల అన్యాక్రాంతం కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలోని 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదైంది. సోమవారం బంజారాహిల్స్, మీర్పేట్, విరాట్నగర్, సంతోష్నగర్, మొయినాబాద్, యాకుత్పురలోని వ్యాపారి మునావర్ ఖాన్, ఖదీరున్నిసా, ఎంఏ సుకూర్, షర్ఫన్ ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ మధ్య తెల్లవారుజాము నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సోదాలు జరిగాయి. ప్రధానంగా వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. మునావర్ ఖాన్ ఇంట్లో వింటేజ్ కార్లు, బీఎండబ్ల్యూ కార్లు, రూ.25 లక్షల నగదు, భారీగా భూదాన్ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఈక్రమంలో సుకూర్, అతడి బంధువు షర్ఫన్, మరో ఇద్దరి ఇండ్లలో సోదాలు జరిపింది.
మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 181లో 104 ఎకరాలను జబర్దస్త్ఖాన్అనే వ్యక్తి భూదాన్ యజ్ఞ బోర్డుకు దానమిచ్చారు. ఆ తర్వాత ఇందులో 42.33 ఎకరాల భూమికి జబర్దస్త్ఖాన్ కొడుకు మహమ్మద్ హాజీఖాన్పట్టా సంపాదించాడు. అనంతరం ఈ భూమికి తానే వారసురాలునంటూ హాజీఖాన్ కుమార్తె మహ్మద్ ఖాదిరున్నిసా బేగం తెరపైకి వచ్చారు. 2006లో ఆమె పేరిట ఎన్వోసీ రావడంతో మహ్మద్ అక్బర్ అలీఖాన్, మహ్మద్ ఫరూక్ అలీఖాన్ , షరీఫ్, ముజఫర్ హుస్సేన్ ఖాన్రికార్డుల్లోకి వచ్చారు.
వీరికి పలువురు మధ్యవర్తులు, రియల్టర్లు తోడయ్యారు. వీరంతా కలిసి 2021లో ఈ భూమిని ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్కు విక్రయించారు. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా అమోయ్కుమార్, మహేశ్వరం తహసీల్దార్గా జ్యోతి ఉన్నారు. కాగా, ఈ అక్రమ భూబదలాయింపుపై దస్తగిరి అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు నిరుడు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. మహేశ్వరం పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. బాధ్యులందరికీ నోటీసులు జారీ చేశారు.
కీలకంగా జ్యోతి స్టేట్మెంట్
దర్యాప్తులో భాగంగా అప్పటి మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి ఇచ్చిన స్టేట్మెంట్ను ఈడీ ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్గా అమోయ్కుమార్ ఆదేశాల మేరకే భూ బదలాయింపు చేశానని జ్యోతి వెల్లడించినట్లు సమాచారం. ఈక్రమంలో అమోయ్కుమార్ను నిరుడు అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో ఈడీ అధికారులు ప్రశ్నించి.. భూదాన్ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్స్కు సంబంధించిన వివరాలను సేకరించారు.
నాటి తహసీల్దార్, సబ్రిజస్ట్రార్ జ్యోతితో పాటు ఖదీరున్నిసా, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్, బొబ్బిలి విశ్వనాథ్రెడ్డి, ఎన్. సంతోష్కుమార్, భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీ సహా సుమారు15 మంది స్టేట్మెంట్స్ను రికార్డ్చేశారు. ఈక్రమంలోనే ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్స్తో వందల కోట్ల విలువైన భూములను రియల్టర్లకు అప్పగించినట్లు గుర్తించారు. భారీ మొత్తంలో బ్లాక్మనీ చేతులు మారినట్లు తేలడంతో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.