
- 6,979 మంది నుంచి 1,700 కోట్లు వసూలు చేసిన సంస్థ
- ఇండియన్ కరెన్సీని క్రిప్టోల్లోకి మార్చి..దుబాయ్, మలేషియాకు తరలింపు
- 14 షెల్ కంపెనీలకు రూ.850 కోట్లు మళ్లింపు
- చైర్మన్, ఎండీ, సీఈవోపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ
హైదరాబాద్, వెలుగు: ఫాల్కన్ ‘ఇన్వాయిస్ డిస్కౌంట్’ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశాల్లో ఉన్న ఫాల్కన్ షెల్ కంపెనీలకు క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో మళ్లించిన ఫండ్స్వివరాలు సేకరిస్తున్నది. ఈ మేరకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తున్నది.
హైదరాబాద్లోని హైటెక్ సిటీ హుడా ఎన్క్లేవ్ కేంద్రంగా ‘ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ 6,979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. దుబాయ్, మలేషియా సహా మొత్తం 14 షెల్ కంపెనీలకు రూ.850 కోట్లు మళ్లించినట్లు సైబరాబాద్పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఢిల్లీకి చెందిన బాధితులు సహా పలువురి ఫిర్యాదుల మేరకు ఈ నెల 11న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈవోడబ్ల్యూ పోలీసులు.. ఆదివారం ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంతను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ప్రధాన నిందితులు దుబాయ్లో..
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఫాల్కన్ డైరెక్టర్ అమర్ దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ దుబాయ్కి పారిపోయారు. వీరిపై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. వీరు సొంతంగా చార్టర్ ఫ్లైట్ కొనుగోలు చేసి తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను అప్రమత్తం చేశారు. హైటెక్ సిటీ హుడా ఎన్క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ మల్టీ లెవల్ మార్కెటింగ్ నిర్వహిస్తోంది.
ఇన్వాయిస్ డిస్కౌంట్స్ ఆఫర్ పేరుతో ఏటా 11 నుంచి 22 శాతం రిటర్న్స్ ఇస్తామని నిర్వాహకులు నమ్మించారు. గత నాలుగేండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 6,979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా, మరో రూ.850 కోట్లను మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా ద్వారా దుబాయ్, మలేషియా లోని14 షెల్ కంపెనీల అకౌంట్లకు మళ్లించారు. దర్యాప్తులో భాగంగా రెండు మూడు రోజుల్లో ఈడీ సోదాలు చేసే అవకాశాలు ఉన్నాయి.