
- శంషాబాద్ లో రూ. 14 కోట్ల చార్టర్డ్ ఫ్లైట్ సీజ్
- పరారీలో ప్రధాన నిందితుడు అమర్ దీప్
- లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ఈడీ
- ఈ కేసులో ఇప్పటికే ముగ్గురి అరెస్టు
- మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్ల పేరిట రూ.1,700 కోట్లు వసూలు
- తిరిగి డిపాజిటర్లకు రూ.850 కోట్లు చెల్లింపు
- మిగతావి తిరిగి ఇవ్వలేక పరారీలో నిందితుడు
హైదరాబాద్: మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీముల పేరుతో రూ. 1,700 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఫాల్కన్ సంస్థ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిన్న అర్ధారాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ను ఈడీ సీజ్ చేసింది. 12 గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. ఈడీ అధికారులు ఫ్లైట్ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కాం కేసు నిందితుడు అమర్ దీప్ రూ. 14 కోట్లు వెచ్చించి చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేశాడు. అదే ఫ్లైట్లో దుబాయ్ కి పారిపోయినట్లు తెలుస్తోంది. 15 రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయిన అమర్ దీప్.. ఫ్లైట్ను తిరిగి హైదరాబాద్కు పంపారు. ఈ ఫ్లైట్ మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న అర్ధరాత్రి సమయంలో ల్యాండ్ అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమరదీప్ దుబాయ్ లో ఉన్నట్టు భావిస్తున్న ఈడీ అధికారులు ఇది వరకే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఏమిటీ స్కాం
అధిక లాభాల ఆశ చూపి రూ. 1,700 కోట్లను ఫాల్కన్ కంపెనీ వసూలు చేసింది. ప్రజల నుంచి సేకరించిన డబ్బులను అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతామంటూ ప్రచారం చేసింది. ఇది నమ్మిన ప్రజలు కోట్లాది రూపాయలు డిపాజిట్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులతోనే కీలక సూత్రధారి అమర్దీప్ కుమార్ చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేశాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులు పోలీసులను అశ్రయించారు. దీంతో బాధితులకు రూ. 850 కోట్లను తిరిగి చెల్లించారు. మిగతా డబ్బులు ఇవ్వలేదు.
ALSO READ | అఖిల పక్షానికి కమలం, కారు దూరం.. హాట్ టాపిక్గా రెండు పార్టీల తీరు
సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంతో అమర్దీప్తో పాటు 10 మంది పరారయ్యారు. విదేశాల్లో ఎంజాయ్ చేసుకునేందుకు చార్టర్డ్ ఫ్లైట్ను కొనుగోలు చేసుకున్నాడు. ఫాల్కన్ సీఈవో, సీవోవో కుటుంబాలతో కలిసి అమర్దీప్ ఎస్కేప్ అయ్యాడు. మరోవైపు అమర్దీప్తో పాటు 15 మందిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అమర్ దీప్ ను దుబాయ్ నుంచి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.