
ఇంటర్ ఫలితాల్లో ప్రతి ఏడాది తప్పులు జరుగుతాయనీ, ఈసారి కూడా జరిగాయనీ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి చెప్పారు . సీఎం ఆదేశాల మేరకు ఫెయిలైన స్టూడెంట్స్ కు రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఉచితంగా చేస్తామని తెలిపారు. ‘‘ఈ నిర్ణయం తీసుకున్నామంటే తప్పులు జరిగాయని కాదు. అనుమానాల నివృత్తి కోసమే. ఇప్పటికే ఫెయిలైన వారు రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంటే.. వారికి ఆ నగదును రీఫండ్ చేస్తాం’’ అని చెప్పారు . బుధవారం సీఎంతో జరిగిన రివ్యూ అనంతరం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏటా 21 వేల వరకూ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తులు వచ్చేవని తెలిపారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ నష్టపోకుండా మే లోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తున్నామన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు ఐటీఐ వైపు వెళ్లాలనీ లేదా మళ్లీ మంచిగా చదివి పాస్ కావాలని సూచించారు. అంతేగానీ ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. భవిష్యత్ లో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు . కాగారీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు విద్యార్థుల నుంచి 55వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది.