
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎకనాథ్ షిండేను ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. కమ్రా వ్యాఖ్యలపై మండిపడ్డ శివసేన కార్యకర్తలు కమ్రా షో జరిగిన హోటల్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కమ్రాను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు శివసేన కార్యకర్తలు.ఇదిలా ఉండగా.. ఈ వివాదంపై తొలిసారి స్పందించారు ఎకనాథ్ షిండే.. తనపై సెటైర్లు వేసేందుకు కమ్రా సుపారీ తీసుకున్నట్లు ఉందని అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ముఖ్యమే అయినప్పటికీ.. దానికి ఓ లిమిట్ ఉంటుందని అన్నారు షిండే.
సెటైర్లను తాను కూడా ప్రోత్సహిస్తాను కానీ.. ఒక పద్ధతంటూ ఉండాలని అన్నారు షిండే. హద్దుమీరితే.. తప్పకుండా రియాక్షన్ ఉంటుందని అన్నారు షిండే. ముంబై ఖార్ ప్రాంతంలోని ‘ది యూనికాంటినెంటల్ హోటల్’లోని హాబిటాట్ కామెడీ క్లబ్లో ఆదివారం కునాల్ కమ్రా షో జరిగింది. ఈ ప్రోగ్రామ్లో ఏక్నాథ్ షిండేను కునాల్ కమ్రా ‘ద్రోహి’గా పేర్కొన్నాడు. దీంతో శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్పై మూకుమ్మడిగా దాడి చేశారు.
ఫర్నిచర్, కిటికీలు, కామెడీ క్లబ్కు సంబంధించిన మైక్లు, సీలింగ్ను ధ్వంసం చేశారు. షిండేపై చేసిన కామెంట్లకు గాను కునాల్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. 11 మందిని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్పై అందరినీ రిలీజ్ చేశారు. తమిళనాడులో ఉన్న కునాల్తో మాట్లాడారు. ఇక చివరికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు రంగంలోకి దిగి ‘ది యూనికాంటినెంటల్ హోటల్’ అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.