
జనగామ అర్బన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16న స్టేషన్ఘనపూర్లో సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.
హెలీప్యాడ్ వద్ద అగ్నిమాపక యంత్రంతో సిబ్బంది, బ్యారికేడింగ్, అంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్, మెడికల్ సిబ్బంది, అందుబాటులో ఉండాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి వసతి, మూత్రశాలలు, మజ్జిగ ప్యాకెట్లు, ఏఎన్ఎంలను నియమించాలన్నారు. ప్రారంభోత్సవాల ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పర్యవేక్షిస్తూ పూర్తిచేయాలని తెలిపారు. సమీక్షలో స్పెషల్డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.