![ఏడుపాయల జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ రాహుల్ రాజ్](https://static.v6velugu.com/uploads/2025/02/elaborate-arrangements-for-edupayala-jatara-festival-in-medak_In7zUMtQ6F.jpg)
మెదక్, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల జాతర నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఏడుపాయలలో జరిగే జాతర నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడుపాయల జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు, దానిని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, షవర్లు, తాగునీటి వసతి, పార్కింగ్, వైద్య సౌకర్యం, పారిశుధ్య పనుల నిర్వహణ, గజ ఈతగాళ్లు, మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా జాతర సమయంలో పార్కింగ్ నియంత్రణ చాలా కష్టతరమవుతున్నందున పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఆర్వో భుజంగరావు, ఆర్డీవో రమాదేవి, నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.