
- యమునా నదిలో బీజేపీ విషం కలిపేందుకు ప్రయత్నించిందని ఆప్ చీఫ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: యుమనా నదిలో హర్యానలోని అధికార బీజేపీ విషం కలిపేందుకు యత్నించిందంటూ ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఘాటుగా స్పందించింది. తప్పుడు ఆరోపణలు చేస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే అన్ని ఆధారాలను జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటలలోపు తమకు సమర్పించాలని సూచించింది. విషం కలుపుతుంటే అడ్డుకున్న ఢిల్లీ జల్ బోర్డ్ ఇంజనీర్ల వివరాలూ ఇవ్వాలని ఆదేశించింది.
హరియాణా నుంచి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదీ ప్రవాహంలో అమ్మోనియా స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించడం తెల్సిందే. యమునా కాలుష్య అంశం ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాలుష్యానికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని, పారిశ్రామిక వ్యర్ధాలను యమునా కలిపి ఢిల్లీలోకి విషాన్ని పంపుతున్నారంటూ కేజ్రీవాల్ రెండ్రోజుల కిందట తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదో రకంగా జీవజల యుద్ధం, వాటర్ టెర్రరిజం అంటూ హరియాణా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.