
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల శాసనసభ ఓట్ల లెక్కింపు, పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను కూడా లెక్కించనున్నట్టు వెల్లడించింది.
మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూ అన్ని ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓ), రిటర్నింగ్ అధికారులతో (ఆర్వో) ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సన్నాహాలపై సమీక్షించారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఫలితాలు కమిషన్ వెబ్సైట్తో పాటు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఐఓఎస్, అండ్రాయిడ్ మొబైల్ యాప్లలో అందుబాటులో ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది.
అలాగే, ఈసీఐ వెబ్సైట్లో రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల కోసం ఎన్నికల సంఘం ఒక హ్యాండ్బుక్ను కూడా విడుదల చేసింది. కౌంటింగ్ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానం, ఈవీఎంలు/వీవీప్యాట్ల స్టోరేజీతో పాటు ఇతర సూచనలు ఇప్పటికే ఈసీఐ వెబ్సైట్లో అందుబాటులో పెట్టింది.