
దేశంలో మూడు జాతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. సీపీఐ, టీఎంసీ, ఎన్సీపీ పార్టీలు జాతీయ పార్టీ హోదా కోల్పోయినట్లు ప్రకటించింది. ఈ మూడు పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీ హోదాను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 2019 జులైలో ఎన్సిపి, టిఎంసి, సిపిఐ పార్టీలకు కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ ఏడాది లోక్సభ ఎన్నికల్లో తమ పనితీరు తర్వాత ఆయా పార్టీల జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ కోరింది. తాజాగా మూడు పార్టీల జాతీయ హోదా రద్దు చేసింది.
ఆప్ జాతీయ పార్టీ..
అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శభవార్త తెలిపింది. ఆప్ కు జాతీయ హోదా పార్టీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 13లోగా ఉత్తర్వులు జారీ చేయాలని గత వారం కర్ణాటక హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
బీఆర్ఎస్కు షాక్..
ఉత్తరప్రదేశ్లో RLD పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం జలక్ ఇచ్చింది. పార్టీ హోదాను ఉపసంహరించుకుంది. దీంతో పాటు పశ్చిమ బెంగాల్లో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కు రాష్ట్ర పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. మణిపూర్లో PDA, పుదుచ్చేరిలో PMK పార్టీల రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసింది. మరోవైపు మేఘాలయలో వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా కల్పించింది. నాగాలాండ్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. త్రిపురలో రాష్ట్ర పార్టీగా టిప్ర మోత పార్టీకి గుర్తింపు దక్కింది.