![ఎమ్మెల్సీ ఎన్నికల విధులపై అవగాహన ఉండాలి : ఎలక్టోరల్ నోడల్ అధికారి పద్మజా రాణి](https://static.v6velugu.com/uploads/2025/02/electoral-nodal-officer-padmaja-rani-suggests-awareness-of-mlc-election-duties_CdJbZwtIy8.jpg)
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా ఎలక్టోరల్ నోడల్ అధికారి పద్మజ రాణి ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రాంతి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఆర్వో పద్మజారాణి మాట్లాడుతూ.. శిక్షణ తరగతులను చక్కగా అర్థం చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందన్నారు. సంయమనంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. మాస్టర్ ట్రైనర్ కృష్ణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించారు.
శిక్షణ తరగతుల్లో ట్రైనింగ్ మేనేజ్మెంట్నోడల్ అధికారి రామాచారి, బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారి బాలరాజు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ రెవెన్యూ డివిజన్ల అధికారులు పాల్గొన్నారు.