
- గతంలో ఏర్పాటు చేసిన సీఎస్కమిటీకి ఇది అదనం
- సీఎం రేవంత్ రెడ్డితోఎమ్మార్ ప్రాపర్టీస్ప్రతినిధుల సమావేశం
- అన్ని అంశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వివిధ దర్యాప్తు సంస్థల కేసులు, చార్జ్షీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఎమ్మార్ ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ జాగ్రత్తగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో సీఎస్ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
వివిధ కేసులతో పెండింగ్లో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మా ర్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మార్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎమ్మార్ ప్రతినిధులతో చర్చల సందర్భంగా అనేక అంశాలను అధికారులు సీఎంకు నివేదించారు. న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం కోసం యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా, వారి ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని చెప్పారు.
ఒప్పందాలు.. కేసులు
2001లో ఉమ్మడి రాష్ట్రంలో దుబాయ్కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఏపీఐఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 అక్టోబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మార్ ప్రాపర్టీస్ కు సంబంధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి సీఎస్ సారధ్యంలో ఐదుగురుసెక్రటరీల కమిటీని ఏర్పాటు చేసింది.
మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్లు జయేష్ రంజన్, రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎమ్మార్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలబ్బర్, ఇండియాలో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్ పాల్గొన్నారు.