
- ప్రభుత్వ ఆంక్షలతో ట్రెజరీల్లో బ్రేక్
- రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా పెండింగ్
- వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎదురుచూపు
- నేడు జడ్పీ ఆఫీసుల వద్ద టీపీటీఎఫ్ నిరసనలు
మెదక్, వెలుగు: జీపీఎఫ్(జనరల్ ప్రావిడెంట్ఫండ్) పైసలు అక్కరకు చేతికందక వేలాది మంది జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, మెడికల్ ఖర్చులు, ఇండ్ల నిర్మాణం తదితరాల కోసం పైసలు అవసరమై జీపీఎఫ్ లోన్, పార్ట్ ఫైనల్ కోసం అప్లై చేసుకుంటే నిరాశ ఎదురవుతోంది. డబ్బులు చేతికందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జడ్పీ ఆఫీస్ నుంచి శాంక్షన్ ప్రొసిడింగ్లు వెళ్లినప్పటికీ ట్రెజరీ నుంచి సంబంధిత ఉద్యోగి, టీచర్ల పర్సనల్ అకౌంట్లలో అమౌంట్ జమ కావడం లేదు. తాము జీతంలో నుంచి జమ చేసుకున్న పైసలను తమ అక్కరకు ఇవ్వక ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
జీపీఎఫ్ఇలా..
జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగులు, టీచర్లకు జీపీఎఫ్అకౌంట్ ఉంటుంది. ప్రతీ నెల వారి బేసిక్ శాలరీ నుంచి 6 శాతం ప్రీమియం కట్ అయి వారి జీపీఎఫ్ అకౌంట్లో జమవుతుంది. జీపీఎఫ్ అకౌంట్లో జమైన మొత్తం నుంచి ఉద్యోగులు, టీచర్లు లోన్ తీసుకునే వీలుంది. లోన్ తీసుకుంటే ప్రతీ నెల ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. అలాగే 20 ఏండ్ల సర్వీస్ ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు, ప్లాట్కొనుక్కునేందుకు, పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, హాస్పిటల్ ఖర్చులకు వారి జీపీఎఫ్ ఖాతాలో జమైన దాంట్లో నుంచి 75 శాతం వరకు పార్ట్ ఫైనల్గా తీసుకునే చాన్స్ ఉంది. దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులు, టీచర్లకు వారి జీపీఎఫ్ ఖాతాలో జమైన మొత్తాన్ని ఫైనల్ పేమెంట్గా చెల్లిస్తారు.
కోట్లలో పెండింగ్..
జడ్పీ పరిధిలో పనిచేసే చాలా మంది ఉద్యోగులు, టీచర్లు ఆయా అవసరాల కోసం పార్ట్ ఫైనల్, జీపీఎఫ్ లోన్ల కోసం అప్లై చేసుకుంటున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు సైతం ఫైనల్ పేమెంట్ కోసం అప్లై చేసుకొంటున్నారు. పార్ట్ఫైనల్, జీపీఎఫ్ లోన్, ఫైనల్మేమెంట్ కోసం వచ్చిన అప్లికేషన్లను సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు పరిశీలించి వారి అర్హతలను బట్టి శాంక్షన్ ప్రొసిడింగ్ లు తయారుచేసి చెక్ రాసి ట్రెజరీకి పంపుతారు. అక్కడ వాటిని అప్రూవ్ చేసి శాంక్షన్ అయిన అమౌంట్ను సంబంధిత ఉద్యోగి, టీచర్ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. అయితే కొన్ని నెలలుగా ఉద్యోగులు, టీచర్లకు సంబంధించిన పార్ట్ ఫైనల్, జీపీఎఫ్ లోన్, ఫైనల్ పేమెంట్ పెండింగ్లో ఉన్నాయి. జడ్పీ ఆఫీసుల నుంచి శాంక్షన్ ప్రొసిడింగ్లు వెళ్లినప్పటికీ ప్రభుత్వ ఆంక్షల కారణంగా ట్రెజరీల్లో పెండింగ్ ఉన్నాయి. కొందరివి ఆరు నెలలు, మరి కొందరివి ఏడాది నుంచి పెండింగ్ ఉండగా, ఇంకొందరివి ఏడాదిన్నరగా పెండింగ్ ఉన్నాయి. ఉదాహరణకు ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది ఉద్యోగులు, టీచర్లకు సంబంధించి దాదాపు రూ.40 కోట్లు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నిజిల్లాల్లో కలిపి రూ.300 కోట్లకు పైగానే పెండింగ్ ఉన్నట్టు తెలిసింది. జీపీఎఫ్ లోన్లు, పార్ట్ఫైనల్ అమౌంటే కాకుండా, జీపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే కుటుంబ సభ్యులకు బూస్టర్ స్కీం పేరుతో రూ.20 వేలు చెల్లించాల్సి ఉండగా అవి కూడా ఇవ్వడం లేదంటున్నారు.
డిమాండ్లు ఇవీ..
జీపీఎఫ్పై ఉన్న ఆర్థిక ఆంక్షలు తొలగించి పెండింగ్లో ఉన్న జీపీఎఫ్లోన్లు, పార్ట్ ఫైనల్ క్లియర్ చేయాలని, 2006 –- 07 నుంచి 2021– 22 వరకు జడ్పీ జీపీఎఫ్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.2,741 కోట్ల వడ్డీ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ జీపీఎఫ్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్ గా ఉన్న దాదాపు రూ.1,000 కోట్లను సరిచేసి ఉద్యోగ, టీచర్ల ఖాతాల్లో జమ చేయాలని, 2006 నుంచి 2013 వరకు ఉద్యోగ, టీచర్లకు బూస్టర్ స్కీం బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే డిమాండ్లతో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ ఆఫీసుల ముందు ఆందోళన నిర్వహించనున్నారు.
ఏడాదిన్నరగా పెండింగ్
నేను అత్యవసరమై 2022 ఫిబ్రవరిలో జీపీఎఫ్ లోన్ కోసం అప్లై చేశా. రూ.2 లక్షలు శాంక్షన్ అయ్యాయి. కానీ ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు డబ్బులు చేతికందలేదు. నా చెక్ ట్రెజరీలోనే పెండింగ్ ఉంది. ఎప్పుడు క్లియర్ అవుతుందో అర్థం కావడం లేదు.
- వెంకటస్వామి, టీచర్, యూపీఎస్ జీడిపల్లి, మెదక్
జమ చేసుకున్న పైసలు ఇయ్యరా?
ఎమర్జెన్సీ టైంలో అక్కరకు వస్తాయని ఉద్యోగులు, టీచర్లు నెల నెలా వారి జీతంలో నుంచి జీపీఎఫ్లో జమ చేసుకున్న పైసలు ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణం. అవసరమైనపుడు జీపీఎఫ్లోన్, పార్ట్ ఫైనల్ తీసుకునే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఆంక్షలు పెట్టి అందకుండా చేస్తోంది. దీనివల్ల ఉద్యోగులు, టీచర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
- వెంకట్రామ్ రెడ్డి, టీపీటీఎఫ్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి