
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన సభ్యులకు 8.15 శాతం వడ్డీ ఇవ్వనుందని సమాచారం. ఈ విషయమై సంస్థ ఇటీవల ఎక్స్ (అధికారికంగా ట్విట్టర్)ద్వారా ఒక అప్డేట్ ఇచ్చింది. “వడ్డీ జమ చేసే పనులు జరుగుతున్నాయి. అతి త్వరలో వివరాలు తెలుస్తాయి. వడ్డీని పూర్తిగా (అక్యుములేటెడ్) చెల్లిస్తాం. నష్టం ఉండదు. ఈ విషయంలో ఓపికగా ఉండండి”అని కోరింది.
సకాలంలో వడ్డీ ఎందుకు చెల్లించడం లేదంటూ ప్రశ్నించిన ట్విట్టర్ యూజర్కు ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ఈపీఎఫ్పై వడ్డీ రేటును ఏటా సమీక్షిస్తారు. 2022 ఆర్థిక సంవత్సరానికి 7.59 శాతం వడ్డీ చెల్లించారు. ఈసారి చెల్లించే 8.15 శాతం రేటు ఏప్రిల్ 2022 – మార్చి 2023 మధ్య చేసిన డిపాజిట్లకు వర్తిస్తుంది. వడ్డీని నెలవారీగా లెక్కించి ఏటా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేస్తారు. ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల మంది సభ్యులతో రూ. 12 లక్షల కోట్లకుపైగా విలువైన కార్పస్ను నిర్వహిస్తోంది.
ALSO READ : బీసీ కోటా అమలులో కాంగ్రెస్ ఫెయిల్
మూడు పథకాల ద్వారా తన లబ్ధిదారులకు పీఎఫ్, పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఆగస్టులో కొత్తగా16.99 లక్షల మంది సంస్థలో చేరారు. ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్, వడ్డీ క్రెడిట్లను ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమంగ్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా తమ కస్టమర్ కేర్ నంబర్1800-118-005కు కాల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది.