
శివ్వంపేట, వెలుగు: ఉపాధి హామీలో పనిచేయని వారి పేర్ల మీద కూలీ పని చేసినట్టు తప్పుడు రికార్డులు రాసి డబ్బులు తీసుకుంటున్నారని ఉపాధి హామీ కూలీలు ఆఫీసర్లను నిలదీశారు. ఈ సంఘటన శుక్రవారం శివ్వంపేట మండలం అల్లీపూర్ లో జరిగింది. గ్రామంలో ఉపాధి కూలీ పనుల్లో అవకతవకలపై ఈజీఎస్ టీఏ మన్సూర్, ఏపీవో అనిల్ ను ప్రశ్నించారు.
పనిచేసిన వారికి కొలతల ప్రకారం డబ్బులు రావడం లేదని, పనిచేయని కూలీలకు మాత్రం డబ్బులు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. తమకు 14 వారాల కూలీ డబ్బులు రావడం లేదన్నారు. పనులు దొరకక ఉపాధి కోసం ఎండను లెక్క చేయకుండా పనిచేస్తే డబ్బులు రాక కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు.