మధ్యప్రదేశ్​బాలాఘాట్లో ఎన్​కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

మధ్యప్రదేశ్​బాలాఘాట్లో ఎన్​కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని బాలాఘాట్  జిల్లాలో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. బాలాఘాట్​ జిల్లా గఢీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని సూప్​ఖర్​ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే పక్కా సమాచారంతో సీఆర్పీఎఫ్, కోబ్రా, జిల్లా పోలీసులతో పాటు హాక్ ఫోర్స్ ను రంగంలోకి దించారు.

రౌందా ఫారెస్ట్  క్యాంప్​ సమీపంలోమావోయిస్టులను బలగాలు గుర్తించాయి. భారీ సంఖ్యలో చేరుకున్న బలగాలను చూసి మావోయిస్టులు పారిపోతూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా, మిగిలిన వారు సమీప అడవుల్లోకి పారిపోయారు. మరికొందరికి గాయాలైనట్లుగా బలగాలు చెబుతున్నాయి. మృతులను గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఇన్సాస్, ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్స్  స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్​ సీఎం మోహన్​ యాదవ్​ మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మావోయిస్టు పార్టీని నియంత్రించడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.