
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్, టెక్నికల్ విభాగాల్లో కొలువుల భర్తీకి ఏఈ, జేటీవో పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ఆకర్షణీయ వేతనంతోపాటు మంచి భవిష్యత్, సర్కారీ కొలువు కల సాకారం చేసుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఈ పోస్టుల వివరాలు, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ గైడెన్స్ తెలుసుకుందాం..
టీఎస్పీఎస్సీ తాజా నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో 833 పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్లతో డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇందుకు అర్హులు.
జీతం: అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు రూ.45,960 -నుంచి రూ.1,24,150; జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.32,800- నుంచి రూ.96,890గా వేతన శ్రేణి పేర్కొన్నారు.
సెలెక్షన్ ప్రాసెస్: పలు శాఖల్లో ఏఈ, జేటీఓ పోస్ట్లకు చేపట్టనున్న ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, అందులో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు ఖరారు చేయనున్నారు. రాత పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ప్రతి పేపర్కు రెండున్నర గంటల సమయం కేటాయించారు. రెండో పేపర్ను ఇంగ్లిష్ మీడియంలోనే నిర్వహిస్తారు.
ప్రిపరేషన్ ప్లాన్
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ
పేపర్-–1గా పేర్కొన్న జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు అభ్యర్థులు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించాలి. అదే విధంగా అంతర్జాతీయ సంబంధాలు, పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ సైన్స్కు సంబంధించి ఇటీవల కాలంలో దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి, తాజా పరిస్థితులు, రక్షణ రంగంలో పరిశోధనలు, ఇస్రో ప్రయోగాలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. పర్యావరణ అంశాలకు సంబంధించి విపత్తు నిర్వహణ, నివారణ వ్యూహాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. భారత్, తెలంగాణకు సంబంధించి ఆర్థిక, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించాలి. అభివృద్ధి పథకాలు తెలుసుకోవాలి. భారత, తెలంగాణ జాగ్రఫీ, చరిత్రలను అధ్యయనం చేయాలి. తెలంగాణ తొలి ఉద్యమ దశ నుంచి తెలంగాణ ఆవిర్భావం వరకు పలు ముఖ్యమైన అంశాలపై ఫోకస్ చేయాలి. తెలంగాణ సంస్కృతి, సామాజిక పరిస్థితులు, కళలు, సాహిత్యం వంటి అంశాలు చదవాలి. అనలిటికల్ ఎబిలిటీలో గ్రాఫ్స్, డేటా అనాలిసిస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు భారత రాజ్యాంగం, ప్రభుత్వ పాలన విధానం, భారత భౌగోళిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను చదవాలి. పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్ను ప్రాక్టీస్ చేయాలి.
పేపర్-2
అభ్యర్థుల అర్హతలు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్ ఆధారంగా పేపర్-2 (సబ్జెక్ట్ పేపర్) పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేందుకు డిప్లొమా స్థాయిలో ఆయా బ్రాంచ్ల అకడమిక్ పుస్తకాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు సర్వేయింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ ప్రాక్టీస్, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, క్వాంటిటీ సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్,ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. మెకానికల్ అభ్యర్థులు హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మెషినరీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్థర్మల్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ టాపిక్స్పై పట్టు పెంచుకోవాలి.
ఎలక్ట్రికల్ అభ్యర్థులు బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, డీసీ మెషీన్స్, ఏసీ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్, యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన అంశాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి.
నోటిఫికేషన్
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష: 2023 జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది.
ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.
వెబ్సైట్: www.tspsc.gov.in
అర్హత: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రాంచ్లతో డిప్లొమా/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు అన్ని పోస్ట్లకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.