ఇంగ్లండ్‌‌ గెలుపు జోరు..7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఓటమి

ఇంగ్లండ్‌‌ గెలుపు జోరు..7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఓటమి

షార్జా : విమెన్స్‌‌ టీ20 వరల్డ్ కప్‌‌లో ఇంగ్లండ్ జోరు చూపెడుతోంది. వరుసగా రెండో విజయంతో సెమీఫైనల్ దిశగా దూసుకెళ్తోంది. సోమవారం జరిగిన గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో ఇంగ్లండ్ అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో  సౌతాఫ్రికాపై గెలిచారు. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన సఫారీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 124/6 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్‌‌ లారా వోల్‌‌వర్ట్‌‌ (39 బాల్స్‌‌లో 3 ఫోర్లతో 42) సత్తా చాటగా.. మరిజేన్ కాప్‌‌ (26), అనెరీ డార్క్‌‌సెన్‌‌ (20 నాటౌట్‌‌) రాణించారు. 

ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం  సివర్ బ్రంట్ (36 బాల్స్‌‌లో 6 ఫోర్లతో 48 నాటౌట్‌‌),  డానీ వ్యాట్ (43 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 43) మెరుపులతో ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 125/3  స్కోరు చేసి గెలిచింది.  ఎకిల్‌‌స్టోన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  ఆడిన రెండు మ్యాచ్‌‌ల్లో  గెలిచిన ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ 4 పాయింట్లతో  గ్రూప్‌‌–బిలో టాప్‌‌ ప్లేస్‌‌లోకి వచ్చింది. ఒక గెలుపు, మరో ఓటమితో సౌతాఫ్రికా  మూడో ప్లేస్‌‌లో ఉంది.