
- కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
- పీఎఫ్ డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్వో దేవాలయమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్మాండవీయ అన్నారు. ఈపీఎఫ్వో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేస్తామని, భవిష్యత్తులో ఏటీఎంల ద్వారా కూడా ఈపీఎఫ్వో సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే 201 టోల్ఫ్రీ నెంబర్ ప్రారంభించామని చెప్పారు.
గురువారం హైదరాబాద్లోని బేగంపేటలో ఈపీఎఫ్వో నూతన జోనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాండవీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కువ నిధులున్న సంస్థ ఈపీఎఫ్వో అని తెలిపారు. కార్మికుల సమస్యలను, క్లైయిమ్లను త్వరగా పరిష్కారమయ్యేలా చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
‘‘ప్రస్తుతం దేశంలో ఎక్కడ పనిచేసేవారైనా నేరుగా బ్యాంకుల నుంచే పీఎఫ్ విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించాం. గతంలో చిన్నచిన్న ఆటంకాలు, సమస్యలు అనేకం ఉండేవి. వాటన్నింటినీ దశల వారీగా తొలగించాం. దేశాభివృద్ధికి వెన్నెముక కార్మిక శక్తే. మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పని విధానంలో కూడా మార్పులను తీసుకువస్తున్నం” అని చెప్పారు.
మూడ్రోజుల్లోనే క్లెయిమ్ల పరిష్కారం: కిషన్ రెడ్డి
కార్మికుల క్లెయిమ్లకు కేవలం మూడ్రోజుల్లోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక నూతన విధానాలతో ముందుకు వెళ్తున్నదని చెప్పారు.
తెలంగాణలో మరిన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, ఈపీఎఫ్వో కార్యాలయాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.