
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) 2024–25 సంవత్సరంలో తన సభ్యులకు ఇచ్చే వడ్డీని మార్చలేదు. ఈసారి కూడా 8.25 శాతమే ఇస్తామని ప్రకటించింది. ఈ సంస్థకు ఏడు కోట్ల మంది చందాదారులు ఉన్నారు. 2023–24లో వడ్డీ రేటు 8.15 శాతం ఉండగా, గత ఫిబ్రవరిలో దీనిని 8.25 శాతానికి పెంచింది.
ఈసారి కూడా 8.25 శాతం వడ్డీ ఇవ్వాలని సంస్థ ట్రస్టీల సెంట్రల్ బోర్డు సిఫార్సు చేసింది. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రానుంది. ఈపీఎఫ్ డిపాజిట్లపై సంపాదించిన మొత్తంపై (కొంత పరిమితి వరకు) ట్యాక్స్ ఉండదు కాబట్టి ఇది ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నాయకత్వంలోని సీబీటీ...ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(ఈడీఎల్ఐ) స్కీము కింద ఇస్తున్న ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పెంచాలని నిర్ణయించింది.
ఏడాది సర్వీసు పూర్తికాకుండానే చందాదారుడు మరణిస్తే రూ.50 వేలు పరిహారం చెల్లిస్తారు. ప్రస్తుతం ఏదైనా కారణాల వల్ల పీఎఫ్ కట్టని రోజులు నెల కన్నా ఎక్కువ ఉంటే ఈ స్కీమ్ వర్తించదు. ఇప్పటినుంచి చివరి చందా చెల్లించిన ఆరు నెలల్లో ఉద్యోగి మరణించినా ఈ పథకం వర్తిస్తుంది.
చందాదారుడు ఒక కంపెనీ నుంచి మరోదానికి మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీసుకు ఒక్క రోజు అంతరాయం కలిగినా ఈడీఎల్ఐ స్కీము నుంచి బయటికి వచ్చినట్టుగా పరిగణిస్తున్నారు. ఇకనుంచి రెండు నెలల గడువు ఉన్నా సర్వీసులో కొనసాగినట్టే భావిస్తారు.