
హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ బేస్డ్ లీగల్ సర్వీసులను అందించే అమెరికాకు చెందిన ఎపిక్, హైదరాబాద్లో తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గురువారం ప్రారంభించారు. లీగల్ ఇండస్ట్రీలో లీడర్గా ఉన్న ఎపిక్, హైదరాబాద్కి రావడం సంతోషంగా ఉందని జయేష్ అన్నారు. హైదరాబాద్లో ఫిన్టెక్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. సంతకాల ఫోర్జరీ ఎక్కువవుతోందని, దీనిని నివారించడానికి కంపెనీ బ్లాక్ చైన్ టెక్నాలజీని డెవలప్ చేయాలని కోరారు. గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి హైదరాబాద్ మంచి గమ్యస్థానమని తెలిపారు. ఎపిక్ గ్లోబల్కు పుణేలో ఒక సెంటర్ ఉంది. హైదరాబాద్లో ఎపిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం, మా వ్యాపారానికి ఇండియా కీలకమనే విషయాన్ని తెలుపుతుందని ఎపిక్ సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ విశాల్ చిబ్బర్ అన్నారు. ఈ కార్యక్రమానికి కంపెనీకి చెందిన 450 పైగా ఇండియన్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎపిక్ మొత్తంగా 15 దేశాలలో విస్తరించింది.