సోషల్ మీడియా ఎఫెక్ట్..ప్రతి నలుగురిలో ఒకరికి ఏడీహెచ్​డీ

సోషల్ మీడియా ఎఫెక్ట్..ప్రతి నలుగురిలో ఒకరికి ఏడీహెచ్​డీ
  • ఏకాగ్రత కుదరక పోవడం లేదా ఓవర్ యాక్టివ్​నెస్ సమస్య
  • అమెరికాలో నిర్వహించిన స్టడీలో వెల్లడి

వాషింగ్టన్: సోషల్ మీడియా ప్రభావంతో ఇటీవలి కాలంలో పిల్లల్లో పెరుగుతున్న ప్రధాన సమస్య ఏడీహెచ్​డీ(అటెన్షన్ డెఫిసిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్). దీని బారిన పడిన పిల్లలకు ఇటు చదువుపై లేదా చేస్తున్న పనులపై ఏకాగ్రత ఉండదు. లేదంటే ఓవర్ యాక్టివ్​గా మారిపోయి అతిగా మాట్లాడటం, నిలకడ లేకపోవడం, అనాలోచితంగా దుందుడుకు పనుల వంటివి చేస్తుంటారు. అయితే, ఇప్పటివరకూ ఏడీహెచ్ డీ పిల్లల్లో ఉండే సమస్య అని భావిస్తున్నారు. కానీ ఏడీహెచ్​డీ సింప్టమ్స్ పెద్దవారిలోనూ కనిపిస్తున్నాయని అమెరికాలో నిర్వహించిన తాజా స్టడీలో తేలిందని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ జస్టిన్ బార్టెరియన్ వెల్లడించారు.

సోషల్ మీడియా ప్రభావం కారణంగా.. అమెరికాలో ప్రతి నలుగురు పెద్దవారిలో ఒకరు (అంటే దేశంలోని పెద్ద వయసు వాళ్లలో 25% మంది) ఏడీహెచ్ డీ బారిన పడి ఉండొచ్చని వెల్లడైందని ఆయన తెలిపారు.

18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్సుల్లో ఉన్న ప్రజల్లో దాదాపు 4.4 శాతం మందికి ఏడీహెచ్​డీ ఉండొచ్చని అంచనా వేశామన్నారు. వీరిలో కొందరికి అసలు తమకు ఆ సమస్య ఉందన్న విషయం కూడా తెలియదన్నారు. స్టడీలో భాగంగా జాతీయ స్థాయిలో వెయ్యి మందిపై సర్వే చేసి, ఈ అంచనాకు వచ్చామన్నారు. అయితే, యాంగ్జైటీ, డిప్రెషన్, ఏడీహెచ్ డీ సమస్యలు చూడటానికి ఒకేలా ఉంటాయని.. అందువల్ల రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంటుందని జస్టిన్ హెచ్చరించారు.