
హైదరాబాద్ సిటీ, వెలుగు: పలు తనిఖీల్లో పట్టుబడిన రూ.3 కోట్లు విలువ చేసే డ్రగ్స్, గంజాయిని ఎక్సైజ్ పోలీసులు దహనం చేశారు. హైదరాబాద్ లోని ఏడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 219 డ్రగ్స్ పట్టివేత కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సీజ్ చేసిన కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్బ్లాస్ట్స్, గంజాయి, హాష్ఆయిల్, పాపిష్టను..సోమవారం రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఈదులపల్లిలో జీకే మల్టికేవ్ ఇండియా ప్రైవేట్ కంపెనీలో దహనం చేశారు. ధూల్పేట్ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 104 కేసులు, జూబ్లీహీల్స్లో 24 , కాచిగూడలో 6 , మలక్పేట్ లో 5 , సికింద్రాబాద్లో 35, నారాయణగూడలో 23, ముషీరాబాద్లో నమోదైన 22 కేసుల్లో పట్టుబడిన డ్రగ్స్ దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.
వీటి విలువ రూ.3 కోట్ల మేర ఉంటుందన్నారు. ఇందులో 756 కిలోల గంజాయి, 1235 కిలోల గంజాయి నుంచి హాష్ఆయిల్తీయగా మిగిలిన పిప్పి, 1.315 కిలోల వెట్ గంజాయి, గంజాయి మొక్కలు, 8 గ్రాముల ఎండీఎంఏ, 10 కిలోల హాష్ ఆయిల్, మరో 10 కిలోల గంజాయి చాక్లెట్లు ఉన్నాయని వివరించారు. గంజాయి విలువ రూ.1.89 కోట్లు, పాపిష్ట విలువ రూ. 62 లక్షలు, 180 గ్రాముల కొకైన్విలువ రూ.37 లక్షలు, హాష్ఆయిల్ రూ.10 లక్షలు, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బ్లాస్ట్స్విలువ రూ.2 లక్షలు కలిపి మొత్తంగా రూ. 3 కోట్ల విలువ చేస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.