
- ఎంఐఎంకు ఒక్క సీటు.. బీఆర్ఎస్కు వన్ ఆర్ నన్!
న్యూఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే లోక్సభ ఎన్నికల పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఎంఐఎం ఒక్క సీటును.. మిగతా 16 సీట్లలో కాంగ్రెస్ సగం, బీజేపీ సగం సీట్లను గెలుచుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు తేల్చాయి. పదేండ్లు అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ మాత్రం ఈ లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశమే లేదని చాలా సంస్థలు లెక్క గట్టగా.. కొన్ని మాత్రం ఒక్క సీటు రావొచ్చని పేర్కొన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 9 సీట్లను గెలుచుకున్నాయి.
కానీ.. ఈ ఎన్నికల్లో మాత్రం ద్విముఖ పోరు నడిచిందని.. అది కాంగ్రెస్, బీజేపీ మధ్యనేనని సర్వే సంస్థలు తెలిపాయి. పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 9 సీట్లు వస్తాయని.. బీజేపీకి 6 నుంచి 8 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎంఐఎంకు ఒక్క సీటు వస్తుందని పేర్కొంది. బీఆర్ఎస్కు ఒక్క సీటు రావొచ్చని, అది కూడా చెప్పలేమని తెలిపింది. ఆరా సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 8 సీట్లు.. బీజేపీకి 8 నుంచి 9 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలిచే అవకాశం లేదని ఆ సంస్థ అభిప్రాయపడింది. జనంసాక్షి సంస్థ బీజేపీకి 8 నుంచి 11, కాంగ్రెస్కు 5 నుంచి 8 సీట్లు రావొచ్చని తెలిపింది. ఎంఐఎంకు ఒక సీటు వస్తుందని.. బీఆర్ఎస్కు సున్న లేదా ఒక సీటు అని అంచనా వేసింది.
ఎగ్జిట్ పోల్స్ (తెలంగాణ.. ఎంపీ సీట్లు: 17)
సంస్థ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇతరులు
(ఎంఐఎం)
పీపుల్స్ పల్స్ 7 - 9 6 - 8 0 - 1 1
ఆరా 7 - 8 8 - 9 0 1
ఇండియా టుడే,
యాక్సిస్ మై ఇండియా 4 - 6 11 - 12 0 - 1 1
జన్ కీ బాత్ 4 - 7 9 - 12 0 - 1 1
సీ ఓటర్ 7 - 9 6 - 8 0 - 1 1
ఇండియా టీవీ సీఎన్ఎక్స్ 6 - 8 8 - 10 0 - 1 1
జనంసాక్షి 5 - 8 8 - 11 0 - 1 1