న్యూఢిల్లీ: రానున్న కొన్నేళ్లలో హాస్పిటాలిటీ (టూరిజం, హోటల్స్) సెక్టార్లో సుమారు 10 లక్షలు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా సంక్షోభం తర్వాత కంపెనీలు విస్తరణ బాట పట్టాయని, కానీ ఉద్యోగుల కొరత కనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం హాస్పిటాలిటీ సెక్టార్లో 100 ఉద్యోగాలు ఉంటే ట్యాలెంట్ ఉన్న వారు 55–60 మంది మాత్రమే దొరుకుతున్నారని రాండ్స్టాడ్ ఇండియా డైరెక్టర్ సంజయ్ శెట్టి అన్నారు. అవసరాలకు తగ్గట్టు ట్యాలెంట్ అందుబాటులో లేదని పేర్కొన్నారు.
దీనికి తోడు కరోనా సంక్షోభం తర్వాత ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోందని అన్నారు. ఇలాంటి ట్రెండే రానున్న కొన్నేళ్ల వరకు కనిపిస్తుందని, ఫలితంగా 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంచనా వేశారు. గత రెండేళ్లుగా ఎంట్రీ లెవెల్ జాబ్స్కు గిరాకి ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల స్కిల్స్ను పెంచడంపై భారీగా ఖర్చు చేస్తున్నాయని అన్నారు. మరికొన్ని కంపెనీలు ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడానికి శాలరీలు పెంచడం, బోనస్లు ఇవ్వడం వంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు.
2023 లో టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టార్ ఏకంగా 1.1 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని టీమ్లీజ్ డిగ్రీ అప్రెంటిషిప్ వైస్ ప్రెసిడెంట్ దృతి ప్రసన్నా మహంతి అన్నారు. ఈ ఏడాది 1.18 కోట్ల మంది అవసరమవుతారని అంచనా వేశారు. 2028 నాటికి ఈ నెంబర్ ఏకంగా 1.48 కోట్లకు పెరుగుతుందని అన్నారు. ఇది ఏడాదికి 16.5 శాతం వృద్ధికి సమానం.