న్యూఢిల్లీ: ఈ నెల 23 న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్కు ప్రభుత్వం పెద్ద పీట వేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెన్యూవబుల్ కరెంట్ ఉత్పత్తి, స్టోరేజ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు స్కీమ్లను బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. బ్యాటరీ స్టోరేజ్ సెగ్మెంట్లో పెట్టుబడులను ఆకర్షించే పాలసీలనూ ప్రకటించొచ్చు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్లలో గ్రోత్ నెమ్మదించిందని, ఈ ప్రాజెక్ట్లు తొందరగా పూర్తి కావాలంటే ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకురావాలని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ కుమార్ కడం అన్నారు.
గ్రీన్ ఎనర్జీకి మారడంలో ఈ ప్రాజెక్ట్లు ఇండియాకు సాయపడతాయని చెప్పారు. ‘ప్రాజెక్ట్లు కమర్షియల్గా సక్సెస్ అయ్యేందుకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) స్కీమ్ను బ్యాటరీ స్టోరేజ్ల తయారీ కంపెనీల కోసం తీసుకురావొచ్చు. ఈ సెక్టార్ కోసం పీఎల్ఐను కూడా ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు. కానీ, ఫ్రేమ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దీన్ని తొందరగా అమల్లోకి తేవాలి’ అని అన్నారు.