న్యూఢిల్లీ : గ్లోబల్గా ఎన్ని సమస్యలున్నా దేశ ఎగుమతులు మాత్రం పెరుగుతున్నాయని, ఈ ఏడాది మే నెలలో మంచి గ్రోత్ను నమోదు చేశాయని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయెల్ అన్నారు. జూన్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని, ఈ ఏడాది ఏప్రిల్– జూన్ క్వార్టర్లో పాజిటివ్ గ్రోత్ నమోదు చేస్తామని అన్నారు. సర్వీసెస్ ఎగుమతులు పెరగడంతో మొత్తం ఎగుమతులు ఊపందుకున్నాయని చెప్పారు. ఇండియా నుంచి గూడ్స్ ఎగుమతులు ఈ ఏడాది మే నెలలో 38.13 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కిందటేడాది మే నెలతో పోలిస్తే 9.1 శాతం వృద్ధి చెందాయి.
అదే ఈ ఏడాది ఏప్రిల్–మే టైమ్లో గూడ్స్ ఎగుమతులు 5.1 శాతం పెరిగి 73.12 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జూన్ నెల ఎక్స్పోర్ట్స్ నెంబర్లను సోమవారం ప్రభుత్వం విదుదల చేయనుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం, ఎర్ర సముద్రంలో సమస్యలు, కంటైనర్ల కొరత ఉన్నప్పటికీ దేశ ఎగుమతులు పెరుగుతున్నాయని, సర్వీసెస్ ఎగుమతులు పెరుగుతుండడం కలిసొస్తోందని గోయెల్ అన్నారు. డిజిటల్ ఇండియా మిషన్ నుంచి సర్వీసెస్ సెక్టార్కు బూస్ట్ వచ్చిందని చెప్పారు. 4జీ, 5జీ సర్వీస్లు అందుబాటులోకి వస్తుండడం కూడా కలిసొస్తోందని అన్నారు.
కాగా, 2023–24 లో దేశ మొత్తం ఎగుమతులు 778.2 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. ఇందులో గూడ్స్ ఎగుమతుల వాటా 437.1 బిలియన్ డాలర్లుగా, సర్వీసెస్ ఎగుమతులు 341 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను టచ్ చేస్తుందని అంచనా. గ్లోబల్గా పరిస్థితులు మెరుగుపడితే ఇండియాలోకి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ (ఎఫ్డీఐ) పెరుగుతాయని గోయెల్ అన్నారు. 2023–24 లో 44.42 బిలియన్ డాలర్లు ఎఫ్డీఐలు వచ్చాయి.