
హైదరాబాద్ సిటీ, వెలుగు: రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర తీసుకుని డిగ్రీ, పీజీ, బీటెక్ ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠాను ఫిల్మ్నగర్పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర మంగళవారం వెల్లడించారు. నాంపల్లిలోని బజార్ ఘాట్కు చెందిన ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని మహమ్మద్ హబీబ్ (32), టోలీచౌకీకి చెందిన రజివుల్లా ఖాన్ (35), అలియాబాద్లోని అలీనగర్కు చెందిన లిబర్టీ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ యజమాని సయ్యద్ ఖలీలుద్దీన్(36), అలియాబాద్లోని ఘాజిబండకు చెందిన సక్లాయిన్అహ్మద్సయ్యద్ (25), ఫలక్ నుమాకు చెందిన సయ్యద్ మొయినుద్దీన్ (31), నిజామాబాద్ జిల్లా మల్లపల్లికి చెందిన మహ్మద్ వజాహత్ అలీ(27), యూపీకి చెందిన రాహుల్ తివారీ, సునీల్ కపూర్ ముఠాగా ఏర్పడ్డారు.
వీళ్లు ఫేక్ సర్టిఫికెట్ల దందా చేస్తున్నారు. నిరుద్యోగులు, డ్రాపౌట్ యువతను టార్గెట్చేసుకుని.. ఒక్కో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ సర్టిఫికెట్ను రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు అమ్ముతున్నారు. ఇందులో ఎక్కువగా తెలంగాణ, ఏపీలోని వర్సిటీలతో పాటు చెన్నైలోని అన్నా వర్సిటీ పేరు మీద ఉన్నాయి. మలక్పేటలో ఆఫీసు ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు మహ్మద్ హబీబ్ ఫేక్సర్టిఫికెట్ల వ్యవహారంలో గతంలో జైలుకు వెళ్లొచ్చాడు. ఇతడు యూపీకి చెందిన ఏజెంట్లు సునీల్ కపూర్, రాహుల్ తివారీ ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసేవాడు. 2023లో సునీల్ కపూర్ అరెస్టయ్యాక అతడి సహచరుడు తివారీ హబీబ్తో దందా కొనసాగించాడు.
సర్టిఫికెట్లను అతడు హైదరాబాద్కు పోస్ట్ద్వారా పంపేవాడు. మహ్మద్ హబీబ్ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పెట్టుకుని దందా నడిపేవాడు. ఈ క్రమంలో ఈ నెల 17న వజాహత్ అలీ ఫేక్ సర్టిఫికెట్స్తో పోలీసులకు దొరికాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అన్ని విషయాలు చెప్పాడు. దీంతో మంగళవారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వద్ద ఐదుగురిని పట్టుకున్నారు. వీళ్లు సిటీ నుంచి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరి దగ్గర 114 ఫేక్ సర్టిఫికెట్లు, 4 ల్యాప్ టాప్లు, ప్రింటర్, బైక్, ఏడు సెల్ఫోన్లు, విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.