హైదరాబాద్‍లో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం.. జిరాక్స్ షాప్‌లో పెట్టి అమ్ముతుండ్రు

హైదరాబాద్‍లో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం..  జిరాక్స్ షాప్‌లో పెట్టి అమ్ముతుండ్రు

హైదరాబాద్ లో ఫేక్ సర్టిఫికేట్లు దందా బట్టబయలైంది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం చేసిన రైడ్స్ లో ఓ జిరాక్స్ షాప్ లో ఫేక్ సర్టిఫికేట్లు దొరికాయి. అంబర్‌పేట్‌లోని ఒవైసీ నగర్‌లో MS ఎంటర్‌ప్రైజెస్‌ జిరాక్స్‌ సెంటర్‌పై కమీషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, సౌత్‌జోన్‌ బృందం, అంబర్‌పేట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర ఎడ్యుకేషనల్ ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేసి డబ్బులకు అమ్ముతున్నారు. మహమ్మద్ మహఫూజ్ ఇక్బాల్, షేక్ ఇలియాస్ అహ్మద్ ఇద్దరు కలిసి జిరాక్స్ సెంటర్‌ను నడుపుతున్నాడు.

ఇద్దరు నిందితులు పలు ఆన్‌లైన్ సేవలు అందిస్తున్నారు. ఇక్బాల్‌కు ఫోటో షాప్‌పై అవగాహన ఉంది. ఇలియాస్ అహ్మద్ ఏజెంట్‌గా ఉండి సర్టిఫికేట్లు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. ఒక్కో సర్టిఫికేట్ కోసం అభ్యర్థుల నుంచి భారీ డబ్బులు వసూళ్లు చేస్తారు.
వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 83 ఫేక్ సర్టిఫికేట్లు, 14 జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు,2 ఎంటీ సర్టిఫికేట్లు, ఓ పెన్ డ్రైవ్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అంబర్‌పేట పోలీసులు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.