నకిలీ మందులు నమ్మితే ప్రమాదం

నకిలీ మందులు నమ్మితే ప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలో నకిలీ ఔషధాలు తరచూ పట్టుబడుతున్నాయి. కొన్ని స్థానికంగానే తయారు చేస్తుండగా, మరికొన్ని ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా వీటిని మెడికల్ షాపులకు చేరవేస్తున్నారు. ఎక్కువ లాభాలు వస్తుండటంతో కొంతమంది వీటిని విక్రయిస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. చాక్‌‌‌‌ పీస్ పౌడర్, మొక్కజొన్న పిండితో కూడా నకిలీ మెడిసిన్స్ తయారు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖాధికారులు గతంలో గుర్తించారు. డాక్టర్ రెడ్డీస్, అబౌట్, సన్ ఫార్మా గ్లెన్ మార్క్, అరిస్టో, టోరెంట్ కంపెనీల బ్రాండ్లను అతికించి నకిలీ మందులను విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు.

 మోతాదు కంటే అతి తక్కువ రసాయనాలు, ఒక ఫార్ములాకు బదులు మరో ఫార్ములా వాడుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ప్రభుత్వ డిస్పెన్సరీలకు సైతం నకిలీ మందులు సరఫరా చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మందులను కొనకపోతే.. ఉన్న రోగం పోవడమేమో కానీ.. కొత్త రోగాలు వచ్చే ప్రమాదమున్నది. ఔషధాల్లో ఉండే యాక్టివ్‌‌‌‌ ఇంగ్రేడియెంట్‌‌‌‌ మన శరీరంలోకి చేరిన తర్వాత వ్యాధిని నియంత్రిస్తుంది. అయితే.. నకిలీ మందులతో ఈ ప్రక్రియ జరగదు.  ‘అమాక్సిసిల్లిన్‌‌‌‌’ ట్యాబ్లెట్లలో ‘పారాసిటమాల్‌‌‌‌’ నింపుతున్నారు. లేదా తగినంత పరిమాణంలో యాక్టివ్‌‌‌‌ ఇంగ్రేడియెంట్‌‌‌‌ వేయడం లేదు.  కేన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుండె జబ్బు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉపయోగించే మందులకు కూడా నకిలీలను తయారుచేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుండె జబ్బుల్లో ఉపయోగించే మందుల ధరలు ఎక్కువగా ఉంటాయి. పేషెంట్లు ఏండ్ల తరబడి వీటిని వాడాల్సి ఉంటుంది. దీంతో కేటుగాళ్లు వీటికి నకిలీలను తయారు చేసి, తక్కువ ధర ఆశ చూపి పేషెంట్లకు అంటగడుతున్నారు. 

‘పరిశీలన’ అవసరం

నకిలీ ఔషధాలు అసలు మందులను పోలి ఉంటాయి. దాదాపు ఒరిజినల్ ప్రొడక్ట్ తీరుగానే ప్యాక్​  చేస్తున్నారని, మెడిసిన్‌‌‌‌‌‌‌‌ను ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు పంపించి టెస్ట్ చేస్తే తప్ప కొన్నిసార్లు నకిలీదని గుర్తించలేమని డీసీఏ అధికారులు చెబుతున్నారు.  మందులు కొనేముందు ప్రతి ఒక్కరు ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. దీర్ఘకాలిక రోగాలతో తరచూ మందులు వినియోగిస్తున్నట్లయితే గతంలో కొనుగోలు చేసిన మందులతో ప్యాక్​ను పోల్చిచూడాలి. పేర్లలో స్పెల్లింగ్స్ ను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. తయారీ తేదీ, గడువు తేదీని తనిఖీ చేయాలి. పేరున్న కంపెనీల ఉత్పత్తులను మరీ చౌకగా అమ్ముతుంటే అది నకిలీ ఉత్పత్తి కావొచ్చని అనుమానించాలి. అంతేకాకుండా మెడికల్‌‌‌‌ షాపులో కొనుగోలు చేసిన మందుల బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలి. కేంద్రం ఔషధాలకు సంబంధించి 300 బ్రాండ్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌లను నోటిఫై చేసి, వాటికి బార్‌‌‌‌, క్యూఆర్‌‌‌‌ కోడ్‌‌‌‌ను ఇచ్చింది. ఆ బ్రాండ్స్‌‌‌‌ జాబితాను రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఉంచింది.  భారతదేశంలో 25 శాతం మందులు నకిలీ లేదా తక్కువ నాణ్యత ఉన్నవేనని 2022లో అసోచామ్ అధ్యయనం తేల్చింది.  ప్రపంచంలో అమ్ముడవుతున్న కల్తీ మందుల్లో 35 శాతం ఇండియా నుంచి ఎగుమతి అయినవేనని భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య 2007లోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. 

‘ఆన్ లైన్’కు దూరమే మంచిది

వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లు లేదా ఇతర ఇంటర్నెట్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మందులు కొనుగోలు చేయకపోవడమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లు భారీ డిస్కౌంట్లతో ఫార్మా ప్రొడక్టులను అమ్ముతుండగా.. ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. తగిన టెంపరేచర్లో నిల్వ చేయకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మందుల సామర్థ్యం తగ్గవచ్చని చెబుతున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీలు, డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్ అనుమతి లేని ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పేషెంట్లకు నకిలీ మందులను చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపులను సైతం వినియోగించుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే నకిలీ ఔషధాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే టోల్‌‌‌‌ ఫ్రీ నెంబర్ 1800 599 6969కు సమాచారం అందించాలి. గడువు తీరిన ఔషధాలు అమ్మినా డ్రగ్ ఇన్​స్పెక్టర్​కు గానీ లేదా టోల్‌‌‌‌ఫ్రీ నెంబర్‌‌‌‌కైనా ఫోన్ చేయడం మన బాధ్యత.

- సింగిడి అమృత్,
 సీనియర్ జర్నలిస్ట్