
- సీజన్కు ముందే జిల్లాకు చేరిన గ్లైసిల్ పత్తి విత్తనాలు
- భీమిని మండలంలో రూ.6.85 లక్షల సీడ్ పట్టివేత
- ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి
- జిల్లాలో ఏటా రూ.20 కోట్లకు పైగానే దందా
- సీజన్ ప్రారంభంలోనే హడావుడి .చేస్తున్న ఆఫీసర్లు
- అప్పటికే రైతులకు చేరుతున్న నకిలీ విత్తనాలు
మంచిర్యాల, వెలుగు: పత్తి సీజన్కు మూడు నెలలు ముందుగానే మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల దందా షురువైంది. సీజన్ ప్రారంభంలో అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉండడంతో అక్రమార్కులు ముందుగానే స్టాక్ తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నకిలీ సీడ్ను రహస్య స్థావరాలకు తరలించి నిల్వ చేసుకుంటున్నారు. అదును చూసి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల 3న భీమిని మండలం మల్లిడి వద్ద పోలీసులు 20 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న విషయం తెలిసిందే. వీటిని ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం హత్తిని నుంచి వడాలకు బైక్పై తరలిస్తుండగా పక్కా సమాచారంతో ట్రాప్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో హత్తిని గ్రామంలోని రాజన్న ఇంట్లో 2.27 క్వింటాళ్ల సీడ్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.85 లక్షలు ఉంటుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. చింతలమానెపల్లి మండలం గంగాపూర్కు చెందిన పురుషోత్తం, పోశం, కృష్ణ, హత్తినికి చెందిన రాజన్న, గుంటూరుకు చెందిన సురేశ్పై కేసు నమోదు చేశారు.
రూ.20 కోట్ల పైమాటే..
మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని రైతులు నిషేధిత గ్లైసిల్(బీటీ3) విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉండగా, ఇందులో సగం విస్తీర్ణంలో గ్లైసిల్ నాటుతున్నారు. పత్తిలో సులువుగా కలుపు నివారణ, చీడపీడల బెడదను తట్టుకునేందుకు ఈ విత్తనాలపై మొగ్గు చూపుతున్నారు. గ్లైపోసెట్అనే గడ్డిమందు కొడితే పత్తి మొక్కలకు ఎలాంటి నష్టం లేకుండా గడ్డి మాత్రమే చనిపోతుం దని ప్రచారం చేయడంతో రైతులు ఎగబడి కొంటున్నారు. ఇదే అదునుగా వివిధ కంపెనీల పేర్లతో లేబుల్స్వేసి, లూజ్గా రూ.2,500 నుంచి రూ.3వేలకు కిలో చొప్పున దళారులు అమ్ముతున్నారు. ఈ లెక్కన ఎకరానికి కిలో విత్తనాలు అవసరం కాగా.. జిల్లాలో ఏటా రూ.20 కోట్లపైనే నకిలీ దందా సాగుతోంది.
ఆంధ్ర దళారులకు అధికారుల అండ
నకిలీ సీడ్ దందాలో ఆంధ్రకు చెందిన దళారులదే కీలక పాత్ర. లోకల్గా ఉన్న ఫర్టిలైజరర్స్ నిర్వాహకులతో చేతులుకలిపి, గ్రామాల్లో ఏజెంట్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని దందా నడిపిస్తున్నారు. గతంలో అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లోనే ఈ దందా సాగేది. వారికి వ్యవసాయ, పోలీస్ అధికారుల అండ ఉండడంతో నకిలీ విత్తనాలను అరికట్టడం సవాల్గా మారింది. ముఖ్యంగా మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లోని పోలీసు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు రూ.లక్షల్లో ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి.
గతంలో బెల్లంపల్లి డివిజన్లోని పోలీసు అధికారులు దళారుల నుంచి భారీగా వసూళ్లు చేసి చూసీచూడనట్టు వదిలేశారనే విమర్శలున్నాయి. నకిలీ సీడ్ను కంట్రోల్ చేయాలంటే ఇప్పటి నుంచే నిఘా పెంచాలని, టాస్క్ఫోర్స్ టీమ్లను రంగంలోకి దించి దళారులను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ దందాను అరికట్టేందుకు కలెక్టర్, పోలీస్ కమిష నర్ రంగంలోకి దిగాలని కోరుతున్నారు.
ఆలస్యంగా తేరుకుంటున్న అధికారులు
జిల్లాలో ఏటా పత్తి సీజన్ ప్రారంభానికి ముందునుంచే నకిలీ సీడ్ దందా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఆలస్యంగా తేరుకుంటున్నారు. సీజన్లో అధికారులు దాడులు పెరిగే అవకాశం ఉండడంతో దళారులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. జనవరి నుంచే గ్లైసిల్ సీడ్ను తీసుకొచ్చి గ్రామాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఏప్రిల్, మే నాటికే విత్తనాలను రైతులు చేర్చుతున్నారు. అధికారులు మాత్రం సీజన్ ప్రారంభంలో అగ్రికల్చర్, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ఫోర్స్ టీమ్లు ఏర్పాటుచేసి తనిఖీలు చేపడుతున్నారు. అప్పటికే అంతా అయిపోవడంతో నామమాత్రంగా కేసులు బుక్ చేసి చేతులు దులుపుకొంటున్నారు.