- ఇంటి ఓనర్కు తెల్వకుండా లోన్ తీసుకున్న దళారి
- ఈఎంఐ కట్టకపోవడంతో జప్తుకు వచ్చిన బ్యాంక్ ఆఫీసర్లు
- ఒంటిపై డీజిల్ పోసుకునికుటుంబం ఆత్మహత్యాయత్నం
- బేగంపేట్ ప్రకాశ్నగర్లో ఘటన
హైదరాబాద్, వెలుగు: రూ.కోటి విలువ చేసే ఇంటిని తమకు తెలియకుండా ఓ బ్రోకర్ బ్యాంకులో తాకట్టు పెట్టాడని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంటిని జప్తు చేసేందుకు వచ్చిన బ్యాంకు అధికారుల ముందే ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. బేగంపేట్ ప్రకాశ్నగర్లో మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రకాశ్నగర్కు చెందిన భూషణ్..కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య అనసూయ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవల కూతురికి పెండ్లి నిశ్చయమైంది. పెండ్లికి అవసరమైన డబ్బు కోసం దినకర్ అనే ఓ బ్రోకర్ ను భూషణ్ కలిశాడు.
ఓ ప్రైవేట్ ఫైనాన్సియర్ వద్ద లోన్ఇప్పిస్తానని భూషణ్ ను దినకర్ నమ్మించాడు. తన భార్య రజినీకి ఇంటిని అమ్మినట్టు భూషణ్ చేత పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడు.పెండ్లి కోసం భూషణ్కుటుంబానికి రూ.4 లక్షల వరకు ఇచ్చాడు. భూషణ్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను హైదర్గూడలోని మహారాష్ట్ర బ్యాంక్లో దినకర్ మార్టిగేజ్ చేసి రూ.కోటి తీసుకున్నాడు. రూ.35 లక్షలు మాత్రమే లోన్ తీసుకున్నట్టు భూషణ్కుటుంబానికి చెప్పాడు. దినకర్ ఈఎంఐలు కరెక్ట్ గా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు భూషణ్ఇంటిని జప్తు చేసేందుకు మంగళవారం వచ్చారు.
తమ ఇంటిని జప్తు చేయవద్దని భూషణ్ వేడుకున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో భూషణ్, అతని భార్య అనసూయ, వారి కొడుకు ఒంటిపై డీజిల్పోసుకుని నిప్పంటించుకోబోయారు. స్థానికులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థాలానికి చేరుకున్న బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుల తరఫు అడ్వకేట్ తో కలిసి బ్యాంక్ కు వెళ్లి అధికారులతో మాట్లాడారు.