అక్టోబర్ 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సర్వే.. ఒప్పుకుంటేనే ఫ్యామిలీ ఫోటో..

అక్టోబర్ 3 నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సర్వే.. ఒప్పుకుంటేనే ఫ్యామిలీ  ఫోటో..
  • రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో అయిదు రోజుల పాటు సాగ‌నున్న ప్ర‌క్రియ‌
  • ప‌ట్టణ, న‌గ‌ర ప్రాంతాల్లో జ‌నాభా ఆధారంగా ఎక్కువ టీమ్‌లు
  •  కుటుంబం ఫొటో దిగ‌డం ఆప్షన్ మాత్రమే: సీఎం రేవంత్

హైద‌రాబాద్‌:  తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీకి 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర స్థాయిలో  పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ప‌రిశీల‌న స‌మ‌ర్థంగా చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ఆదేశించారు.   238 ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌ట్టాల‌ని రేవంత్  సూచించారు. వార్డులు,  డివిజ‌న్లలో జ‌నాభా ఎక్కువగా ఉండే అవ‌కాశం ఉన్నందున ప‌రిశీల‌న టీంల సంఖ్యను  పెంచుకోవాల‌ని  సీఎం సూచించారు. 

తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి   స‌చివాల‌యంలో సమీక్ష నిర్వహించారు.  ఈ సంద‌ర్భంగా ఫ్యామిలీ డిజిట్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు, సేక‌రించే వివ‌రాల‌ను అధికారులు సీఎంకు  వివ‌రించారు. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర స్థాయిలో ప‌రిశీల‌న‌ చేప‌ట్టనున్న గ్రామాలు, వార్డులు/  డివిజ‌న్ల ఎంపిక పూర్తయిందని అధికారులు సీఎంకు వివ‌రించారు. పైలెట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేప‌డ‌తార‌ని సీఎం ప్రశ్నించారు. 

ALSO READ | హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మికి అస్వస్థత..

అక్టోబ‌ర్  మూడో తేదీ నుంచి ఏడో తేదీ వ‌ర‌కు అయిదు రోజుల పాటు చేప‌డ‌తామ‌ని అధికారులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యులు అంతా ఒప్పుుకంటేనే ఫ్యామిలీ ఫొటో తీయాల‌ని, అదో ఆప్షన్ గా ఉండాల‌ని, కుటుంబం స‌మ్మతి  లేకుంటే ఆ ఫొటో తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని రేవంత్ తెలిపారు.  క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాల‌కు ఉన్న నోడ‌ల్ అధికారులు క‌లెక్టర్లకు మార్గ నిర్దేశం చేయాలని .. అప్పుడే ప‌క‌డ్బందీగా కార్యక్రమం కొన‌సాగుతుంద‌ని  సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

ప్రభుత్వం దగ్గర ఉన్న రేష‌న్ కార్డు, పింఛ‌ను స్వయం స‌హాయ‌క సంఘాలు, రైతు భ‌రోసా, రుణ‌మాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ‌, కంటి వెలుగు త‌దిత‌ర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల‌ గుర్తింపున‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని..  పైలెట్ ప్రాజెక్టులో దానిని నిర్ధారించుకోవ‌డంతో పాటు కొత్త స‌భ్యులను జ‌త చేయ‌డం, మృతి చెందిన వారిని తొల‌గించ‌డం చేస్తామ‌ని  అధికారులు వివ‌రించారు. కుటుంబ స‌భ్యుల వివ‌రాల న‌మోదు, మార్పులుచేర్పుల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. పైలెట్ ప్రాజెక్టుతో బ‌య‌ట‌కు వ‌చ్చిన సానుకూల‌త‌లు,  ఎదురైన ఇబ్బందుల‌తో నివేదిక త‌యారు చేయాల‌ని  రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదిక‌పై చ‌ర్చించి లోపాల‌ను ప‌రిహారించిన అనంత‌ర పూర్తి స్థాయి  క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ చేప‌డ‌దామ‌ని తెలిపారు.