హనుమకొండ జిల్లాలో .. చనిపోయిన ఎంప్లాయ్ పేరిట 12 ఏండ్లుగా పింఛన్

హనుమకొండ జిల్లాలో .. చనిపోయిన ఎంప్లాయ్ పేరిట 12 ఏండ్లుగా పింఛన్
  • మతిస్థిమితం లేని బంధువును చూపిస్తూ.. బ్యాంకులో 
  • లైఫ్ సర్టిఫికెట్ అందజేత
  • పింఛన్ తీసుకుంటూ మోసగిస్తున్న  మృతుడి కుటుంబసభ్యులు 
  • హనుమకొండ జిల్లా హసన్​పర్తిలో ఘటన 

హసన్​ పర్తి, వెలుగు: చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగి పింఛన్ 12 ఏండ్లుగా.. అదే పేరు కలిగిన బంధు వైన మతిస్థిమితం లేని వృద్ధుడి పేరిట కాజేస్తున్న ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. హసన్​పర్తి మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాములు(తండ్రి పేరు కొమరయ్య)  పంచాయతీ రాజ్​ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు.

అతను సర్వీస్​పింఛన్​ పొందుతూ 2012లో చనిపోయాడు. కానీ కుటుంబ సభ్యులు రాములు చనిపోయిన విషయాన్ని బ్యాంకు అధికారుల వద్ద దాచిపెట్టారు. పేరు, తండ్రి పేరు ఒకేలా ఉన్న రక్త సంబంధీకుడైన వేల్పుల రాములుకు మతి స్థిమితం లేకపోగా ఆయనను చూపిస్తూ పింఛన్ ​తీసుకుంటున్నారు.  ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన కొడుకులు తమ తండ్రి బతికే ఉన్నట్టుగా ప్రతి ఏడాది బ్యాంకులో లైఫ్​ సర్టిఫికెట్ ​కూడా అందజేస్తున్నారు. కాగా వేల్పుల రాములుకు ఆసరా పింఛన్ ​వస్తుండగా గతేడాది మే నెల నుంచి ఆగిపోయింది.

దీంతో కుటుంబ సభ్యులు పింఛన్ ​రావడం లేదని ఆఫీసర్లకు వినతిపత్రం అందించగా.. సర్వీస్​ పెన్షన్​వస్తున్నందున, ఆసరా పింఛన్ ​నిలిపివేశామని తెలిపారు. దీంతో మతిస్థిమితం లేని వేల్పుల రాములు మనుమడు కార్తీక్​ అనుమానించి ఆరా తీశాడు. చనిపోయిన రిటైర్డ్​ఉద్యోగి పింఛన్ ను తన తాత పేరిట కాజేస్తున్నట్లు గుర్తించి శుక్రవారం హసన్​పర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హనుమకొండ ఎస్ బీఐ అధికారులకు సమాచారం అందించగా సర్వీస్​ పింఛన్ , బ్యాంక్ అకౌంట్ స్టేట్​మెంట్స్​సేకరిస్తున్నారు. ఏండ్లుగా రూ.లక్షల్లో  పింఛన్​ డబ్బులు కాజేసినట్టు తెలుస్తుండగా, పూర్తి వివరాలతో నిర్ధారణకు వచ్చాక నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.