గీత రచయిత గురు చరణ్ కన్నుమూత

గీత రచయిత గురు చరణ్ కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత గురు చరణ్ (77) కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. ముద్దబంతి పువ్వులో మూగ భాషలు, కుంతి కుమారి తన కాలుజారి, బోయవాని వేటుకు గాయపడిన కోయిల లాంటి సూపర్ హిట్ పాటలెన్నో ఆయన రాశారు. ఆయన అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్. 

అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, దర్శకుడు మానాపురం అప్పారావు ఆయన తల్లిదండ్రులు. ఎం.ఏ చదివిన గురుచరణ్ ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. ఆపై రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. ముఖ్యంగా మోహన్ బాబుకు గురుచరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. 

తన సినిమాల్లో ఒక్క పాటైనా ఆయనతో రాయించేవారు.  అలా మోహన్ బాబు చిత్రాలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలను గురుచరణ్ రాశారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు