
మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కవగా రైతు భరోసా కింద రూ.12 వేల 500కి బదులుగా ఏడాదికి రూ.13 వేల500 అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు జగన్.
2023–24 సీజన్కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7వేల500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటివరకు ఒక్కో రైతు కుటుంబానికి రూ. 61 వేల 500 లబ్ధి చేకూరినట్లుగా జగన్ తెలిపారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పిన జగన్... ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా అని జగన్ ప్రశ్ని్ంచారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువేనని, టీడీపీ పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరువు లేదు, వలసలు లేవని జగన్ చెప్పారు.
రైతుకు శత్రువైన చంద్రబాబు అన్నదాతను ముంచేశాడని జగన్ ఆరోపించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడని విమర్శించారు. టీడీపీకి పోటీ చేయాడానికి అభ్యర్థులు లేరని అన్నారు.