మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
  • ములుగు జిల్లాలో ఘటన

వెంకటాపురం వెలుగు:  అప్పు తిరిగి ఇవ్వమని ఫెర్టిలైజర్  షాప్ ఓనర్ దౌర్జన్యం చేయడంతో మనస్తాపం చెందిన రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన  ములుగు జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం..  వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన బొగట నరసింహారావు మిర్చి పంట సాగు చేశాడు. అదే గ్రామానికి చెందిన శ్రీ దుర్గా మాత ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ బొల్లె ప్రశాంత్ వద్ద అప్పు చేశారు. 

బుధవారం సాయంత్రం ప్రశాంత్ రైతును డబ్బులు ఇవ్వమని బలవంతం చేశాడు. ఆపై బూతులు తిట్టాడు. దీంతో మనస్తాపం చెందిన  నరసింహారావు పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స చేశారు.  అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏటూరు నాగారం ఆస్పత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం రైతు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది.