- సాగుకు సన్నద్ధం
- దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు
- జనగామ జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం అంచనా
జనగామ, వెలుగు : వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె మొదలు కానుండగా, ఈసారి వర్షాలు ముందే కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా అధికారులు యాక్షన్ప్లాన్ రెడీ చేశారు.
3.70 లక్షల ఎకరాల్లో పంటల సాగు..
వానాకాలంలో జనగామ జిల్లాలో 3 లక్షల 70 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 2 లక్షల 10 వేల ఎకరాల్లో వరి, లక్షా 45 వేల ఎకరాల్లో పత్తి, కందులు 10 వేల ఎకరాలు, కూరగాయలు తదితర పంటలు మరో 5 వేల ఎకరాల్లో సాగు కానున్నట్లు నివేదికలు రూపొందించారు. ఈ మేరకు 63 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 4 లక్షల 35 వేల పత్తి విత్తన ప్యాకెట్లు, 400ల క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని ప్రణాళికలు సిద్ధం చేశారు.
గత వానాకాల సీజన్ లో లక్షా 90 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, రైతులు 2 లక్షల 10 వేల 664 ఎకరాల్లో సాగు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి వరి సాగు అంచనాను 2.10 లక్షలకు పెంచారు. పత్తి పంట కూడా గత సీజన్లో లక్షా 70 వేల ఎకరాల్లో సాగును అంచనా వేస్తే, లక్షా 22 వేల 164 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ప్రస్తుత అంచనాను లక్షా 45 వేలకు తగ్గించారు. కంది పంటను కూడా గత సీజన్లో 11 వేల ఎకరాల్లో సాగు అని అంచనా వేయగా కేవలం 2,477 ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి 10 వేల ఎకరాలకు అంచనాను తగ్గించారు.
74 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల నివేదికలు
జిల్లాలోని పంటల సాగుకు మొత్తంగా 74,251 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముంటాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు నివేదికలు పంపించారు. ఇందులో 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 14,800 మెట్రిక్ టన్నుల డీఏపీ, 16,366 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 6,085 మెట్రిక్ టన్నుల పొటాషియం అవసరం కానున్నట్లు ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించారు.
రసీదులు తప్పనిసరి..
వానాకాలం సీజన్ లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నం. సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నం. రైతులు లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. రైతులు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి.
బీ.వినోద్ కుమార్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్