డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌ పై దాడి.. అంగిపట్టి గుంజి కొట్టారు

డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌ పై దాడి.. అంగిపట్టి గుంజి కొట్టారు

జనగామ, వెలుగు : పట్టాదారు పాసు బుక్కు లేకుండా తమ భూమిని ఒక్కరి పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్  చేస్తారంటూ ఆగ్రహించిన బాధితులు జనగామ డిప్యూటీ తహసీల్దార్​ జగన్​ పై శుక్రవారం దాడి చేశారు. ఒక్కసారిగా ఆఫీస్ లోకి దూసుకొచ్చి  డీటీతో వాగ్వాదానికి దిగారు. కాలర్​ పట్టి లాగడంతో షర్ట్​ చినిగిపోయింది. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. జనగామ మండలం వడ్లకొండకు చెందిన ముల్కల పోశమ్మ, వెంకటయ్యలకు ఏడుగురు కుమారులు, ఒక కూతురు. పోశమ్మ గత జనవరి 27న వడ్లకొండ రెవెన్యూ పరిధిలోని 645/2 సర్వే నంబర్ లో తనకున్న 20 గుంటల భూమిని కూతురు గాజ సుజాత పేరిట రిజిస్ట్రేషన్​ చేసింది. ఆ టైంలో పట్టాదారు పాసు బుక్​ లేక పోవడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాసుబుక్ కనిపించడంలేదని పోశమ్మ  ఫిర్యాదు చేసింది. 

 వృద్దురాలినైన తన ఆలనా పాలనా కూతురే చూసుకుంటుందని.. ఎలాగైనా రిజిస్ట్రేషన్​ చేయాలని వారిని కోరింది. దీంతో వన్​ బీ ఆధారంగా డీటీ జగన్​ గిఫ్ట్​ రిజిస్ట్రేషన్​ చేశారు. ఈ విషయం తెలిసి ఆ భూమిపై తమ ఏడుగురికి హక్కుఉందని, పాసుబుక్​ లేకుండా ఒక్కరి పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్​ చేస్తారని పోశమ్మ కొడుకులు, వారి కుటుంబసభ్యులు ఆఫీస్​ కు వచ్చి డీటీని నిలదీశారు. లంచం తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్​ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరగగా బాధితులు డీటీ టేబుల్​ పై ఉన్న దరఖాస్తులను చిందర వందర చేశారు. అతని కాలర్​ పట్టి గుంజారు. బాధితులు తహసీల్దార్​ వెంకన్నను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తానని తహసీల్దార్​హామీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, పాసుబుక్​ పోయిందని ఫిర్యాదు చేస్తే రూల్స్​ మేరకు గిఫ్ట్​ రిజిస్ట్రేషన్​ చేశానని డీటీ జగన్ అన్నారు. అకారణంగా తన పై దాడి చేసి గాయపరిచారని వాపోయారు. 

దాడి చేసిన వారిపై కేసు నమోదు

డీటి జగన్​పై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వడ్లకొండ కు చెందిన ముల్కల శ్రీను, రాజు, మల్లేశ్​, ఉప్పలయ్య, వెంకటయ్య, నాగరాజు, తరుణ్ , కరుణాకర్, అంజమ్మ, అనసూయ, పద్మ, శారద, సుజాత తదితరులు తహసీల్దార్​ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ జగన్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని తహసీల్దార్​ వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్​ పై దాడిని టీఎన్​జీఓస్​ జిల్లా కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్​ తీవ్రంగా ఖండించారు. సంఘం లీడర్లు రాజనర్సయ్య, రాంనర్సయ్య. మధు, ప్రభాకర్​ తదితరులతో కలిసి పోలీస్​ స్టేషన్​కు చేరుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు.