మార్కెట్​లోకి నకిలీ పత్తి విత్తనాలు .. సీజన్​కు ముందే రైతులకు అంటగడుతున్న దళారులు

మార్కెట్​లోకి నకిలీ పత్తి విత్తనాలు .. సీజన్​కు ముందే రైతులకు అంటగడుతున్న దళారులు
  • రైతులకు ఫోన్​ చేసి విత్తన ప్యాకెట్లు హోమ్  డెలివరీ
  • కర్నాటక, ఇతర జిల్లాలకు సప్లై
  • జిల్లాల్లో టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేస్తున్న ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు: అకాల వర్షాలకు వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు.. రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ కార్తె రావడానికి ఇంకా నెల టైం ఉండడంతో పత్తి సాగుకు చేయాలనుకుంటున్న రైతులు విత్తన ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొందరు విత్తన వ్యాపారులు, పెస్టిసైడ్స్​ షాపుల నిర్వాహకులు రైతులను మోసం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు కాకుండా.. లూజ్​ విత్తనాలను అంటగడుతున్నారు. 

వారం రోజుల్లో ఉమ్మడి పాలమూరులో జిల్లాలో 15 క్వింటాళ్ల లూజ్​ విత్తనాలను ఆఫీసర్లు పట్టుకొని సీజ్​ చేశారు. పత్తి విత్తనాల కొనుగోలు సీజన్​ కావడంతో.. ఉమ్మడి జిల్లాలో అగ్రికల్చర్, పోలీస్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో టాస్క్​ఫోర్స్​ టీమ్ లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఏటా సీజన్​లో ఆఫీసర్లు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫెయిల్​ సీడ్స్​ను మార్కెట్​లోకి చలామణి చేస్తున్న అసలు సుత్రధారులను కాకుండా.. కొందరిపై కేసులు పెట్టి చేతులు దలుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. 

ఇంటికి వచ్చి ప్యాకెట్లు ఇస్తున్నారు..

నకిలీ విత్తనాలను కట్టడి చేయడానికి ఆఫీసర్లు టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేస్తుండడంతో వ్యాపారులు వీటిని  రవాణా చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్లాన్​ ప్రకారం ఈ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాత పరిచయాలను ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు రైతులకు ఫోన్లు చేస్తున్నారు. ‘విత్తనాలు వచ్చాయి. మీరు షాపుల వద్దకు రావాల్సిన అవసరం లేదు. మేమే మీ ఊరికి వస్తాం. వచ్చే ముందు మీకు ఫోన్​ చేస్తాం. మీ ఇంటి అడ్రస్​ చెప్పండి’ అని వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వ్యాపారులు వారి ఏజెంట్ల ద్వారా బైకుల మీద 10, 20 ప్యాకెట్ల చొప్పున నేరుగా రైతు ఇంటి వద్దకు పంపిస్తున్నారు. 

ఎవరికీ అనుమానం రాకుండా రైతులకు ఫెయిల్​ సీడ్స్​ అంటగడుతున్నారు. తక్కువ ధరకు విత్తనాలు వస్తుండడం, మండలాలు, జిల్లా కేంద్రాల్లోని షాపుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం.. వ్యాపారులు ఇండ్ల వద్దకు వచ్చి విత్తన ప్యాకెట్లు ఇచ్చి వెళ్తుండడంతో ఆ ప్యాకెట్లు కొనడానికి ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. కానీ, అవి ఫెయిల్​ అయిన విత్తనాలు అని తెలియక.. తీరా విత్తనాలు విత్తుకున్నాక తెలుసుకొని నష్టపోతున్నారు.

నష్టపోతున్న రైతులు..

ఉమ్మడి జిల్లాలోని నాగర్​కర్నూల్, గద్వాల, నారాయణపేట, మహబూబ్​నగర్​ ప్రాంతాల్లో రైతులు వరి తర్వాత పత్తి సాగుకు మొగ్గు చూపుతారు. ఇందులో గద్వాలలో సీడ్​ పత్తికి డిమాండ్​ ఉండగా.. వనపర్తిలో మాత్రం అత్యల్పంగా పత్తి సాగు చేస్తారు. అయితే జర్మినేషన్​ టెస్టులో ఫెయిల్​ అయిన విత్తనాలను కొందరు వ్యాపారులు రైతుల నుంచి సేకరిస్తున్నారు. ఆ విత్తనాలకు వివిధ కంపెనీ లేబుళ్లతో ప్యాక్, సీల్​ వేసి రైతులకు అమ్ముతున్నారు. ఈ విత్తనాలతో పంట ఏపుగా పెరిగినా.. దిగుబడులు రావడం లేదు. నిరుడు నర్వ, మరికల్, మిడ్జిల్, చిన్నచింతకుంట, దేవరకద్ర, మాగనూరు, మక్తల్​ మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. పత్తి మొక్కలు ఎదిగినా.. పూత, కాత రాలేదు. కొన్ని చోట్ల మొక్కలకు కాయలు పట్టినా.. ఐదారుకు మించి లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

15 క్వింటాళ్ల లూజ్​ విత్తనాలు పట్టివేత..

నాలుగు రోజుల్లో ఆఫీసర్లు ఉమ్మడి జిల్లాలో 15 క్వింటాళ్ల లూజ్​ విత్తనాలను పట్టుకొని సీజ్​ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్  మండలం కుర్తిరావులచెర్వు గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో సబ్ ఆర్గనైజర్ కు చెందిన 12.75 క్వింటాళ్ల సీడ్  విత్తనాలు పట్టుకొని సీజ్​ చేశారు. వీటి విలువ దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకాల గ్రామ శివారులో గురువారం టాస్క్​ఫోర్స్ పోలీసులు, అగ్రికల్చర్  ఆఫీసర్లు కుర్వ బస్వారాజు పొలంలోని షెడ్​లో ఐదు సంచుల లూజ్  పత్తి విత్తనాలు పట్టుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.

రైతుల వద్దకే వెళ్తున్నారు..

కొందరు రైతులు పత్తి విత్తనాలను షాపుల వద్ద కొనడం లేదు. షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. షాపుల్లో కేవలం ప్రభుత్వ సర్టిఫైడ్​ విత్తనాలు మాత్రమే ఉన్నాయి. నకిలీ విత్తనాలు అమ్మేవారు నేరుగా గ్రామాల్లోని రైతుల ఇండ్లకు రాత్రిళ్లు వెళ్లి విత్తన ప్యాకెట్లు ఇస్తున్నారు. ఆ సమాచారం దొరకడం లేదు. ఇలాంటి విత్తనాలతో పంట ఎదగక రైతులు నష్టపోయే అవకాశం ఉంది. లాస్​ అయిన తర్వాత మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. 

వెంకటేశ్, డీఏవో, మహబూబ్​నగర్